నేటి నుండి ( బుధ వారం నుండి ) కార్తీక మాసం ప్రారంభం.

కార్తీక మాసం


కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుంది కనుక ఈమాసానికి కార్తీక మాసం   అని పేరు.

కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు కూడా ఉంది.

కౌముది అంటే వెన్నెల.

ఈ మాసంలో చంద్రుడి నుంచి వచ్చే వెన్నల అమృతబిందువులను వర్షిద్తుంది.

సంవత్సరంలో 12 నెలల్లో దేవతలను ఎక్కువగా పూజించడానికి కార్తీక మాసం శేయస్కరం.

ఈ మాసంలో శివకేశవులిద్దరిని కలిపి ఆరాధించాలి.

కార్తీక పురాణంలో రోజుకో అధ్యాయం చదవడం మంచిది.


ఆచరించవలసినవి :


ఈ నెలలో కార్తీక స్నానం,
కార్తీక దీపం,ఉపవాసం చాలా ముఖ్యమైనవి.

రోజూ తెల్లవారు జామునే దగ్గరలో ఉన్న నది, చెరువు, తటాకం లోనో లేదా బావి దగ్గరో తలస్నానం చేయాలి.

ఈ స్నానం సూర్యోదయానికి కంటె ముందే ముగియాలి.

ఇంకా చెప్పాలంటే నక్షత్రాలు వెళ్ళకముందే స్నానం చేయాలి.

ఇలా చేసే స్నానం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కార్తీకేహం కరిష్యామి ప్రాతః స్నానం జనార్దన|ప్రీత్యర్ధం తన దేవేశ దామోదర మయా సహ||

అనే మంత్రం చెప్పి తలస్నానం చేయాలి.

ఈ కార్తీక స్నానం కాయిక, వాచిక, శారీరిక దోషాలను తొలగిస్తుంది.

స్నానం తరువాత శివుడిని బిల్వదళాల (మారేడు ఆకులు) తోనూ, విష్ణువును తులసిదళాలతోనూ పూజించాలి.

అలాగే ఈ నెలలో తుమ్మి పూలతో శివుణ్ని, అవిసె పూలతో విష్ణువును పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది.

ప్రతి రోజూ ఉదయం (సూర్యోదయానికి ముందు), సాయంకాలం ఇంటి గడపల దగ్గర, తులసి చెట్టు దగ్గర "ఆవునెయ్యితో" దీపారాధన తప్పనిసరిగా చేయాలి.

 ఈ మాసంలో చేసే దీపారాధనకు చాలా ప్రాముఖ్యం ఉంది.

కార్తీక మాసం మొత్తం ఏకభుక్తం (ఒక పూట మాత్రమే భోజనం చేయడం) ఉండడం, పగలు ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం చేత పుణ్యం సిద్ధిస్తుంది, ఆరోగ్యం రక్షింపబడుతుంది.

పగలంతా ఉపవాసం చేయలేనివారు అల్పాహారం తీసుకోవచ్చు

(బ్రహ్మచారులు (పెళ్ళి కానివారు), 80 సంవత్సరములు పైబడినవారు, ఆనారోగ్యంతో బాధపడేవారు, కాయకష్టం చేసేవారు (శారీరకశ్రమతో పని చేసేవారు, బలహీనులు) ఈ ఉపవాసం చేయనవసరంలేదు).

ఈ నెలంతా ఉపవాసం చేయలేనివారు కనీసం సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాసశివరాత్రి లాంటి పర్వదినాలలో అయినా ఆచరించడం ఉత్తమం.

ఈ మాసం మొత్తం బ్రహ్మచర్యాన్నిపాటించాలి,

వంకాయ, ఉల్లిపాయ, వెలుల్లి మొదలైన వంటలు, మాంసాహారాలు, బిర్యానీలు, బయట అమ్మె వంటకాలు, చిరుతిళ్ళు, మసాలాపదార్ధాలు తినడం నిషిద్ధం. ఉపవాసం పక్కన పెట్టేసినా, అందరూ ఆచరించదగ్గవి ఆహారనియమాలు పాటించడం, ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం ముగించడం, రోజు దీపం వెలిగించడం. ఈ రెండు చేసినా, అతిత్వరలో జీవితంలో పెనుమార్పు కనిపిస్తుంది.



- స్వస్తి