మిత్రులందరికీ 🙏శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏




రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః ! రూప దాక్షిన్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే !తేజసా దిత్యసంకాశః క్షమయా పృథివీసమః ! బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః ! 



         శ్రీ రాముడు మానవాళికి మార్గదర్శకుడు. ఒక ఉత్తమ  మానవుడి లక్షణాలు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన మహనీయుడు.   శ్రీరామనవమి , శ్రీరాముడి యొక్క  జన్మదిన వేడుక. విష్ణుమూర్తి యొక్క (7) వ అవతారమే రామావతారం.  చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నమధ్యాన్న సమయ మందు రాముడు జన్మించెను .  

 వసంత నవరాత్రులు ఆఖరి రోజు. ఈ తొమ్మిది రోజులు అంటే ఉగాది రోజు మొదలు కొని, శ్రీరామనవమి రోజు వరకు, ఉత్సవాలు, అర్చనలు, పూజలు, భజనలు, కీర్తనలు చేస్తారు. నవమి రోజున సీతారామ కళ్యాణం చేస్తారు. మరునాడు దశమి రోజున పట్టాభిషేకం చేస్తారు.  ఉత్తర భారతదేశంలో మిధిలా, అయోధ్య - తమిళనాడు లో రామేశ్వరం లో ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం లో చాల వైభవం గా ఉత్సవాలు జరుగుతాయి.  అయోధ్య లో లక్షలాది మంది పవిత్రమైన సరయు నదిలో స్నానం చేస్తారు, రధయాత్ర లో పాల్గొంటారు.

          రాముడి ఆలయం లేని ఊరంటూ భారతదేశంలో ఉండదు.  అన్ని ఆలయాలలోను పందిళ్ళు వేసి సీతారామకల్యాణం తప్పకుండా చేస్తారు.  చైత్రమాసం ఆరంభం ఇప్పుడిప్పుడే  ఎండలు ముదురుతూ ఉంటాయి, అందుకేనేమో సీతారామకల్యాణం లో తప్పకుండా మిరియాలు వేసిన పానకం అందరికి ఇస్తారు, పాయసం తప్పకుండా చేస్తారు. కళ్యాణం లోని తలంబ్రాలని పెళ్లి కాని పిల్లలు అక్షతలు గా వేసుకొంటే వెంటనే పెళ్లి కుదురుతుంది అని నమ్మకం. 

         మనం కూడా ఇంట్లో యధా శక్తి రాముడి పూజ చేసుకొని, మల్లెపూల దండల తో సీతారాములని అలంకరించి, పానకం, వడపప్పు, పాయసం నైవేద్యం గా పెట్టి ప్రసాదం గా స్వీకరించండి. తప్పనిసరిగా సీతారామకల్యాణా నికి వెళ్ళండి.. 

శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత :


         శ్రీ రామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు . శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో  గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 

రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. 

సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. 

భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది. 

కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

రామాయణం : 

రామాయణకధ తెలియని భారతీయులు ఎవరు ఉండరు.  రామాయణం చదవని వాళ్ళు చాలామంది ఉంటారు. కర్ణాకర్ణి  గా కధ తెలియని వారు ఉండరు. ఎందుకంటే రాముడు మన జీవనానికి అంతర్వాహిని లాంటి వారు.  రామాయణం కధగా పారాయణం చేయటం కంటే, శ్రీరాముడు మానవాళికి అందించిన సందేశాన్ని, ఆయన ఆచరించి చూపిన జీవనశైలిని మనం అందిపుచ్చుకొంటే తిరిగి రామరాజ్యమే భువిపై వెలుస్తుంది. అద్దం లో చూసుకొని ముఖం దిద్దుకొన్నట్టు  మనం రామాయణం చదివి మన నడవడిని దిద్దుకొందాం. తండ్రి  తో ఎలా మాట్లాడాలి, తల్లి తో ఎలా మాట్లాడాలి ,  భార్య తో ఎలా ప్రవర్తించాలి, సోదరులతో ఎలా ఉండాలి, ప్రభువు ఎలా ఉండాలి, సేవకుల తో ఎలా మెలగాలి, శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ మన నిత్య జీవితం లో ఎదుర్కొనే సమస్యలు, వీటన్నిటి పరిష్కారం మనకి  రామాయణ కావ్యం లో వాల్మీకి మహర్షి అందించారు.  


రామాయణ కాలం : 


రామాయణాన్ని ఆది కావ్యం అన్నారు.  రామాయణం త్రేతాయుగం లో వ్రాయబడింది.  (ద్వాపరయుగం లో - భారతం, కలియుగం లో - భాగవతం).   మరి అంతకు ముందు కృతయుగం లో ఏ  గ్రంధము లేదా అనే సందేహం వస్తుంది.  

దీనికి సూటి సమాధానం లేక పోయినా,  మనం ఒక విధమైన ప్రామాణికం చెప్పుకొవచ్చు  - కృతయుగం లో ధర్మం నాలుగు పాదాలా నడచింది అని శాస్త్రం చెపుతుంది.  తప్పొప్పులు అందరికి స్పష్టంగా తెలిసేవి. సమాజం కోసం ఏదైనా వ్రాయవలసిన/ఆచరించవలసిన  అవసరం ఆ యుగం లో లేక పోయింది.   అందువలన వేదాలని  రక్షించి ముందు తరాలకి అందింఛడమే  లక్ష్యం గా ఆ యుగం ముగిసింది. 

త్రేతాయుగం నాటికి సమాజం లో మార్పులు వచ్హాయి.  మానవుడు విజ్ఞానం లో నూ, ఆర్థికం గాను అభివృద్ధి సాధించాడు.  ఆర్ధిక వికాసం వల్ల  అవసరాల నుంచి ఆశ ల లోకి, అక్కడ నుంచి దురాశ  లోకి ప్రయాణించటం మొదలు పెట్టాడు. 

          ఇలాంటి సందర్భం లో సమాజం దారి తప్ప కుండా ఉండాలంటే  అంతవరకు  వేదాలలో చెప్పబడిన విషయాలు అందరికి అర్థం కావాలని బ్రహ్మ సంకల్పించారు.  దీన్ని ఆచరించి చూపించటానికి ఒక మానవుడి కధ  ఆధారం కావాలని, అలా ఐతే అందరికి అర్ధం అవుతుంది అని సంకల్పించారు.

అంటే రాముడు మానవుడు అనుకోండి -అయన అనుభవించిన సుఖాలు చదివి మనం ఆనందిస్తాం, కష్టాలకి చలించిపోతాం, విజయాలు చదివితే ధర్మం జయంచింది అని గర్వ పడతాము,  కష్టాలలో కూడా ఎలా మనో ధైర్యం గా ఉండాలో నేర్చుకుంటాము. ధర్మ మార్గంలో నడవటం అలవాటు చేసుకుంటాము .  అదే రాముడు దేముడు, అవతార పురుషుడు అనుకుంటే - దేముడు కాబట్టి సాద్యం అయింది, మానవమాత్రులం మనవల్ల  ఏమవుతుంది అనుకుంటాము .  ఇదే రామాయణ పరమార్ధం, మానవుడు ఎలా ఉండాలో చెప్పేదే రామాయణం.  

దీనికి నాంది - ఇంకో ముఖ్య కారణం - రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ  వల్ల - దేవ, దానవ, యక్ష , కిన్నెర, గంధర్వుల లో ఎవరివలనా మరణం లేని వరాన్ని పొందేడు.     వర గర్వం తో ప్రాణికోటి ని హింసిస్తున్నాడు.  మానవుల పట్ల చులకన భావం తో వారివల్ల మృత్యువు లేకుండా వరం పొందలేదు.  అందువల్ల రాముడు మానవుడు ఐతే తప్ప రావణ సంహారం జరగదు. 

బ్రహ్మ గారి సంకల్పానికి అనుగుణంగా నారద మహర్షి వారు వాల్మికి మహర్షి ఆశ్రమానికి వచ్చారు.  అప్పుడు సంభాషణ లో వాల్మీకి వారు ఇలా అడిగారు - 

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ! 
ధర్మజ్ఞశ్చ  సత్యవాక్యో ధృడవ్రతః !

(ఇక్కడ 5 శ్లోకాలు ఉన్నాయి ) 

 ఓ నారద మునీంద్ర , సకల సద్గుణ సంపన్నుడు, ఎట్టి విపత్కర పరిస్థిలొను తొణకనివాడు, సకలధర్మాలు తెలిసినవాడు, శరణాగతవత్సలుడు, ఆడితప్పనివాడు , సకలప్రాణులకు  హితము గూర్చువాడు, ధైర్యశాలి, అరిషడ్వర్గమును జయించినవాడును, అరివీరభయంకరుడు  ఐనటువంటి  మానవుడు ఈ  లోకంలో ఉన్నాడా  అని ప్రశ్నించారు. 

దానికి సమాధానంగా నారదులవారు చాల సంతోషంతో ఈ విధంగా చెప్పారు - 

ఇక్ష్వాకువంశ  ప్రభవో రామో నామ జనై శ్రుతః !
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన ధృతిమాన్ వశీ !

మీరు అడిగిన సమస్త సద్గుణాలు రాసిపోసి మానవరూపం ఇస్తే  ఎలా ఉంటుందో అతడే  శ్రీరామచంద్రమూర్తి. ఇక్ష్వాకువంశంలో దశరధుడి కి పుత్రుడిగా జన్మించారు అని చెప్పి, సంక్షిప్తంగా రామకధని కుడా చెపుతారు.

 రామాయణ కావ్య ఆవిర్భావం :


 వాల్మికి మహర్షి, భరద్వాజుడు అనే శిష్యుడిని వెంటపెట్టుకొని ఆశ్రమం దగ్గర ఉన్న తమసా నదికి స్నానికి వెళ్లారు.  సమీపంలో ఉన్న చెట్ల పై క్రౌంచ పక్షుల జంట అన్యోనానురాగాలతో విహరిస్తూ కనిపించాయి.  వాటిని చూస్తూ మహర్షి చాల ఆనందం పొందుతున్నారు.  ఇంతలో ఒక బోయవాడు హటాత్తుగా భాణం వేయటం తో అందులో మగపక్షి నేలమీదపడి గిలగిలా కొట్టుకొని మరణించింది, క్రిందపడిన ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ ఆడపక్షి రోదించటం మొదలుపెట్టింది. ఆ హృదయవిదారక దృశ్యం చుసిన వాల్మికి మహర్షి గుండె భారమై, ఆ భాధ కోపమై, శాపమై  మహర్షి నోటివెంట ఈ క్రింది శ్లోకం అప్రయత్నం గా వచ్చినది. 

మానిషాద ప్రతిస్టాం త్వ మగమశ్సాశ్వతీస్సమాః !
 యత్ క్రౌంచ మిధునాదేక మవధీః కామమొహితమ్ !

 (ఓరి కిరాతకుడా క్రౌంచ పక్షుల జంట లో కామమోహితమగు ఒకదానిని చంపి నీవు శాశ్వతమగు అపకీర్తిని పొందితివి -నీవు ఎక్కువ కాలం జీవించవు) 

ఆ తరువాత సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకొని ఆశ్రమానికి వచ్చినా మహర్షి ఆ శ్లోకం గురించే ఆలోచిస్తూ శిష్యుడి తో చెపుతూ ఉంటారు - ఈ శ్లోకం నాలుగుపాదాలతో ఒక్కక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఉండేలా అమరింది, లయబద్దంగా ఉంది, పాడుకొనేందుకు అనువైన లయ తో ఉంది, అంటూ దాన్నే పదేపదే తలచుకొంటున్నారు.
  
అప్పుడు బ్రహ్మగారు వాల్మీకి ఆశ్రమానికి విచ్చేసి, తన సంకల్పం వల్లే నారదుడు రామకధను వినిపించారని, తన సంకల్పం వల్లేసరస్వతీదేవి వాల్మీకి నాలుకపై నిలిచి ఆ శ్లోకం పలికించింది అని చెప్పి, ఇలాంటి మనోహరమైన శ్లోకాలతో, వేదాలు చెప్పిన జీవనవిధానాన్ని కావ్యం లో ప్రతిబింబిస్తూ రామాయణకావ్యం వ్రాయమని ఆదేశించారు. మహర్షి సంకల్పమాత్రంచేత రాముడికధ అతడి మనోరదంలో గోచరమయేటట్లు ఆశ్వీర్వదించారు.

సంక్షిప్త రామాయణం 


ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం ! 
వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవనమ్భాషణం !
వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం ! 
పశ్చాద్రావణ  కుంభకర్ణ హననం యేతద్ది  రామాయణం !
  
కోసలదేశంలో సరయూనదీ తీరంలో అయోధ్యానగారాన్ని దశరధుడు అనే రాజు పరిపాలించాడు. అతనికి ముగ్గురు భార్యలు.  కౌసల్య, సుమిత్ర, కైకేయి.  పుత్రసంతానం లేని రాజు కి యాగఫలంగా నలుగురు కొడుకులు కలిగారు. వారు రామ,లక్ష్మణ ,భరత,శతృజ్ఞులు. రామలక్ష్మనుల వయస్సు ఒక్క రోజు తేడా. - చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కౌసల్యకు రాముడు, అదే రోజు కొన్నిగంటల తరవాత పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు. మరునాడు ఆశ్లేషా నక్షత్రం లో సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. 

శ్రీరాముడు మిథిలా నగరాధిపతి అయిన జనకుని కుమార్తె సీత ను వివాహమాడెను.   పినతల్లి కైకేయి తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరిపించాలని, రాముని పద్నాలుగేళ్ళు వనవాసానికి పంపించాలని దశరథుడిని కోరింది.  పితృ వాక్య పరిపాలకుడైన రాముడు సీతతోను, సోదరుడు లక్ష్మనుడి తొను కలసి అరణ్యవాసం చేసాడు. లంకేశ్వరుడైన రావణుడు సీతను అపహరించుకొని పోగా శ్రీరాముడు వానర సైన్య సహాయంతో రావణుని వధించి భార్య సమేతంగా అయోధ్య చేరి పట్టాభిషిక్తుడై జనరంజకంగా పరిపాలన చేసాడు. 

 ఇంతేనా అనిపించిందా ?  ఇంత కాదు - నేను చెప్పింది సముద్రంలో నీటిబొట్టంత. 

రామాయణ గొప్పతనం,  అందులోని పాత్రల ఔన్నత్యం లో  ,  సన్నివేశాల గంభీరత లో , ధర్మబద్దమైన నిర్ణయాల లో అడుగడుగునా ప్రస్పుటమౌతుంది.  నేను చేసిన ఈ  ప్రయత్నం సూర్యుడిని అద్దం లో చూపించటం లాంటిది. అందుకే అందరు ఒక్క సారైనా రామాయణం చదవండి.  మీ పిల్లలకి చెప్పండి. 

మనకధానాయకుడైన శ్రీరాముని గురించి కొంచెం చెప్పుకుందాం   

రామాయ రామభద్రాయ రామచంద్రయ వేధసే ! 
రఘునాదాయ నాధాయ సీతాయాః పతయే నమః !
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః  సత్య పరాక్రమః ! 
రాజా సర్వస్య లోకస్య దేవానాం మాఘ వానివ ! 

రాముడు మూర్తీభవించిన ధర్మం, సత్పురుషుడు, సత్యపరాక్రముడు, దేవతలకు ఇంద్రుడు ప్రభువైతే, రాముడు సకలలోకాలకు ప్రభువు. 

ఈ వాక్యం అన్నది ఒక రాక్షసుడు -- రెండు సార్లు రాముడి చేతిలో పరాజితుడై, మూడవ సారి అతని చేతిలో మరణించిన మారీచుడు.



రామ్ కర్రి