కార్తీక సోమవార వ్రతంతో వెయ్యి అశ్వమేథయాగాల ఫలం

కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడి తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు.. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. శివకేశవులకు అత్యంత ప్రతీకరమైంది కార్తీకమాసం. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది. కార్తీకమాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు కార్తీకమాసం తొలి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీహస్త భోజనం ఆధ్యాత్మికంగా విశిష్టమైనవి. కార్తీకమాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీస్నానం అత్యంత శ్రేష్ఠమైంది. కార్తీకమాసం శుక్లపక్షంలో అక్షయ నవమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, త్రయోదశిలు ఇలా ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక శుద్ధ త్రయోదశి రోజునే స్వాయంభువ మన్వంతరం ప్రారంభమైందని పేర్కొంటారు. కార్తీకపౌర్ణమి రోజున గౌరీవ్రతం, కార్తికేయ దర్శనాలు చేసుకుంటారు. కార్తీకమాసంలో ఎటువంటి మంచి పనిచేసినా ‘కార్తికదామోదర ప్రీత్యర్థం’అని ఆచరించాలని శాస్త్రోక్తి.

శరదృతువులో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని 'హంసోదకం' అని అంటారు. కార్తీకమాసంలో మానసిక, శారీరక రుగ్మతులను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైంది. పైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం. సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. కార్తీకంలో సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే వేలగోవుల దానఫలితం, వాయిద్యం వాయిస్తే వాహపేయ యజ్ఞఫలం, నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం, పూజా ద్రవ్యాలను సమరిస్తే అన్ని ఫలాలూ, దర్శనం చేసేవారికి ఈ ఫలితాల్లో ఆరోవంతు ఫలం లభిస్తుంది.

విష్ణు, శివాలయాలు లేని ప్రదేశాలలో రావిచెట్టు మొదట్లో గానీ, తులసీవనంలో గానీ భగవంతుని స్మరించుకోవచ్చు. కార్తీకమాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందడానికి పరమేశ్వరుని ఆరాధించాలి. శివుడికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన, జపాలు ఆచరిస్తే వెయ్యి అశ్వమేథాల ఫలం దక్కుతుంది. సోమవార వ్రతాన్ని ఆరు విధాలుగా ఆచరిస్తారు.

ఉపవాసం: కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి, సాయంకాలం శివుడికి అభిషేకం చేసి, నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం సేవించడం.

ఏకభుక్తం: దాన, తపం, జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి, రాత్రి శైవతీర్థమో, తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి.

నక్తం: పగలు అంతా ఉపవాసం ఉండి, రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి.

అయాచితం: భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం.

స్నానం : శక్తిలేని వాళ్లు సమంతరం స్నానం, జపాలు చేసినా చాలు.

మంత్ర, జపవిధులు కూడా తెలియనివాళ్లు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది.

పైన పేర్కొన్న వాటిల్లో ఏది చేసినా సోమవారవ్రతం చేసినట్లే అవుతుంది. కుమారస్వామిని కృత్తికలు పెంచడం వల్ల వారి పేరుతొ ఉన్న కార్తీకమాసం అంటే పరమశివుడికి మహాప్రీతి. గరళకంఠుడి తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు.. కాబట్టి కార్తీకంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.