ఏడాది పొడుగునా నెలకి రెండు పక్షాలు :

 1.శుక్ల పక్షము...  ,2. కృష్ణ పక్షము ...

పక్షానికొక ఏకాదశి చొప్పున్న ..ఇరవైనాలుగు ఏకాదశి లు ఉంటాయి .

 ప్రతి నెలా ఆమవాసి కి , పౌర్ణమికి ముందు ఈ ఏకాదశులోస్తుంటాయి .


 ఆషాడశుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశి గా పరిగనిస్తారు .


 ప్రతినెలలో పూర్ణిమకి ముందు వచ్చే ఏకాదశిని "శుద్ధేకాదశి(శుద్ధ ఏకాదశి)" అంటారు. 

సంవత్సరం మొత్తం లో ఇటువంటి శుద్ధ ఏకాదశులు 12 వుంటాయి.

ప్రతి నేలా అమావాస్య కి ముందు వచ్చే ఏకాదశి ని " బహుళ ఏకాదశి " సంవత్సరం మొత్తం లో ఇటు వంటి బహుళ ఏకాదషులు 12 ఉంటాయి .. 

వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత వున్నా, నాలుగు ఏకాదశులను విశేషదాయకంగా పరిగణిస్తాము. అవి:


1.ఆషాడ శుద్ధ ఏకాదశి.(తొలేకాదశి/శయనేకాదశి)

2. కార్తీక శుద్ధ ఏకాదశి
3. పుష్య శుద్ధ ఏకాదశి (వైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి)
4.మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)

వైకుంఠ ఏకాదశి/ ముక్కోటి ఏకాదశి

పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు. ఒక చిన్న స్థలం ఉంటే తూర్పు దిక్కుగా నిలుచుంటే దానికి నిట్టనిలువుగా తూర్పు పశ్చిమాలు, అడ్డంగా ఉత్తర దక్షిణాలూ వుంటాయి. ఈ ఉత్త్తర దక్షిణ విభాగాన్ని ప్రాచీనులు కేవలం ప్రదేశాలకి మాత్రమే పరిమితం చేయకుండా కాలంలోనూ, శరీరంలోను కూడా ఈ విభాగాన్ని చేశారు.


కాలంలో ఉత్తరం పగలు; దక్షిణం రాత్రి

కుడి చేయి దక్షిణం; ఎడమ చేయి ఉత్తరం
ఎక్కడైనా (ఉత్తర - దక్షిణాలలో) ఉత్తరమే పవిత్రమైనది, శ్రేష్టమైనది.

దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి. 
రాత్రిని దక్షిణాయనం, 
పగటిని ఉత్తరాయణం అన్నారు. 

దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు - అంటే వైకుంఠుడు, ముక్తుడుకాగా దేవతలు కూడా చీకటి పోయి వెలుతురుకు వస్తారన్నమాట.


 అనగా, 



వారి పగలు ప్రారంభమైందన్నమాట. 



ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. 



ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. 



అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. 



అందుకే దీన్ని మోక్షేకాదశి అని కూడా అంటారు.





ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి,ముక్కోటి ఏకాదశి మరియు పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.


             ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

               ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

            ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.

            విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.


ఏకాదశి పేరు ఎలా వచ్చి0ది

     పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది.

           అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు.

            ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.


ఉపవాసము,ఏకాదశి వ్రత0 ఎలా చేయాలి   

         విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం.

         పంచజ్ఞానేంద్రియాలు  (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

          వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి  ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి ఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి) బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు.

                   బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా, స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువైయ్యాడు.


                  కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి, కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది. రామావతారాన్ని ముగించే ముందు, శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుకి ఇచ్చి, తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను, వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరేవరకు విమానవిగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు, లంకాద్వీపానికి బయలు దేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు, కావేరినదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది.


         వెంటనే కావేరీతీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామను కున్నాడు. అయితే విమాన విగ్రహాలను కిందపెట్టకూడదు కదా! ‘ఎలా?!’ అని అటూ ఇటూ చూసిన విభీషణుని కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బ్రతిమాలి, తాను సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి, సంధ్యవార్చుకునేందుకై వెళ్లాడు. దానిని తీసుకున్న బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు. అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది.


             ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు. కోపంతో వూగిపోయిన విభీషణుడు, వినాయకుని గుడిలోకి వెళ్ళి, ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తూ వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సోట్టను చూడవచ్చు.


               బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంత్రం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా, బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళైయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు, రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయ పడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక, తాను అక్కడే ఉండిపోనున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించ వచ్చని చెబుతాడు. విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుని ఆలయాన్ని చూడవచ్చు.


             శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.


         తిరుమలలో కూడా శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే  విధంగా  వైకుంఠద్వారా ప్రవేశం; తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠద్వారాన్ని తెరచి వుంచుతారు.


         ఈ రెండు రోజులూ భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. ఇదే విధంగా తిరుపతి సమీపంలో వున్న శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి,నారాయణ వనం శ్రీకల్ళ్యాణ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలలో మరియు ఏర్పేడు మండలం పాపానాయుడు పేట మార్గం లో వికృత మాల గ్రామము యందు నెలకొని యున్న సంతాన వేంకటేశ్వర స్వామి దేవాలయములలో కూడా వైకుంఠ ద్వారములు ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కలిగించడం విశేషం


            తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలకేంద్రంలో ఉన్న శ్రీరంగనాయక స్వామీ వారి క్షేత్రం విశిష్టతను కలిగి ఉంది. యిక్కడ స్వామివారు శేషతల్పముపైన శేయనించి నాభిమద్యమున బ్రాహ్మణి కలిగి అనంత దేవతాముర్తులతో కనిపించును.. యిక్కడ ఉండు విగ్రహం మరేచోట దర్శనం యివ్వదు.. యిక్కడ వైకుంట ఏకాదశి 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం ఉత్తర ద్వారాన్ని కలిగిఉన్నది. మరియు కార్తికమాస శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి..


       ఈ ఏకాదశి రోజునే గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేస్తారు.



వైకుంఠ ఏకాదశి పేరు 


           వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు "వైకుంఠః" (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు - అని అర్ధాలున్నాయి.


 పండగ ఆచరించు విధానం.

      ఈ ఏకాదశి రోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే.

            ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.


ఏకాదశి వ్రతం నియమాలు : 

1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.

          అందుచేత ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

           వైకుంఠ ఏకాదశి (జనవరి -08) రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.

        విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.

           వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రధమని పండితులు చెబుతున్నారు.

    ఈ ఏకాదశి రోజు మద్యహాన్నం 12 గంటల్లోపు పూజను పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. వెలిగించే వత్తులు తామర వత్తులుగా, వాటి సంఖ్య ఐదుగా ఉండాలి.
కొబ్బరి నూనెను వాడాలి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి.

       ఇవన్నీ చేయలేకపోయినా కనీసం అష్టాక్షరీ మంత్రం " ఓం నమోనారాయణాయ" అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు, వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ 

           పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ

            కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.

          విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

  ఈ వైకుంఠ ఏకాదశిని,ముక్కో టి ఏకాదశి అని,పుత్రద ఏకాదశి అని కూడా అంటారు

           వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు.దీని గొప్పతనాన్ని వివరించే కథ :

         పూర్వం మహారాజు "సుకేతుడు" 'భద్రావతి' రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య 'చంపక'; మహారాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు.

           మహార్షులు ఆ మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య 'చంపక'కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' చేస్తారు.

           అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.


-స్వస్తి....

ఇలాంటి మరిన్నీ విషయాల కొరకు చూస్తూనే ఉండండీ... www.ramkarri.org



- రామ్ కర్రి
9492089900