కార్తీక పురాణం 12వ అధ్యాయము 


(ద్వాదశీ ప్రశంస)


                 మహారాజా! కార్తీకమాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీవ్రతమును గురించి, సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను విను" మని వశిష్ఠ మహాముని ఈ విధముగా తెలియచేసిరి.

           "కార్తీక సోమ వారమునాడు ఉదయమునే లేచి కాల కృత్యములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానముచేసి ఆచమనము చేయవలయును. తరువాత శక్తి కొలదీ బ్రాహ్మణునకు దానమిచ్చి, ఆరోజంతయు ఉపవాస ముండి, సాయంకాలము శివాలయమునకు గాని, విష్ణ్యాలయమునకు గాని వెళ్లి దేవుని పూజించి, నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజింప వలయును.

           ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే గాక, మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన యెడల నావ్ర్తత మాచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ యేకాదశి రోజున, ఫూర్ణోపవాసముండి అ రాత్రి విష్ణ్యాలయమునకు వెళ్లి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన,కోటి యజ్ఞముల ఫలితము కలుగును.

            ఈ విధముగా చేసినవారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన నెంతపుణ్యము కులుగునో దానికంటె నధికముగా ఫలము కలుగును. కార్తీకశుద్ధ ద్వాదశినాడు శ్రీమన్నారాయణుడు శేష పానుపు నుండి లేచును గనుక, కార్తీకశుద్ధ ద్వాదశీ వ్రతము విష్ణువునకు యిష్టము.

          ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవుకొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినయెడల ఆయావు శరీరమందు ఎన్నిరోమములు కలవో అన్ని సంవత్సరములు యింద్రలోకములో స్వర్గసుఖము లందుదురు. కార్తీకమాసమందు వస్త్రదానము చేసినను, గొప్పఫలము కలుగును.

          మరియు, కార్తీక శుద్ధపాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యిపోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశినాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చినవారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశిరోజున బంగారు తులసిచెట్టునుగాని, సాలగ్రామమునుగాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన యెడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును.

దీనికి ఉదాహరణముగా ఒక కథ గలదు - శ్రద్ధగా ఆలకింపుము.

సాలగ్రామ దానమహిమ:

        ఫూర్వము అఖండ గోదావరీ నదీతీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశా పరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు, తాననుభవించక, యితరులకు బెట్టక, బీదలకు దానధర్మములు చేయక, యెల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విఱ్ఱ వీగుచూ యేజీవికీ కూడా ఉపకారమైననూ చేయక "పరుల ద్రవ్యము నెటుల అపహరింతునా!" యను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను.

         అతడొక నాడు తన గ్రామమునకు సమీపమున నున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తనవద్దనున్న ధనమును పెద్దవడ్డీకి అప్పుయిచ్చెను. మరికొంత కాలమునకు తనసొమ్ము తనకిమ్మని అడుగగా ఆ విప్రుడు "అయ్యా! తమకీయవలసిన ధనము ఒక నెలరోజుల గడువులో యివ్వగలను.

         మీ ఋణముంచుకోను. ఈ జన్మలో తీర్చని యెడల మరుజన్మమున మీయింట యేజంతువుగానో పుట్టి అయినా, మీ ఋణము తీర్చుకోగలను" అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి "అట్లు వీలులేదు. నాసొమ్ము నాకిప్పుడే యీయవలయును. లేనియెడల నీకంఠమును నరికి వేయుదును" అని ఆవేశం కొలదీ వెనుకముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకను కోసెను.

             వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి, అక్కడినే యున్నచో రాజభటులు వచ్చి పట్టు కొందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక, అప్పటినుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యాపాప మావహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలూ పడుచూ మరికొన్నాళ్లకు మరణించెను.

                వెంటనే యమదూతలువచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరకకూపముల బడద్రోసిరి. ఆవైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేయుచు పుణ్యకార్యము లాచరించుచు,నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు, చెరువులు త్రవ్వించుచు, సకల జనులను సంతోష పెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను.

             ఇటులుండగా కొంత కాలమునకు త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి, త్రోవలో ధర్మవీరుని యింటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి, విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధులచేత సత్కరించి, చేతులు జోడించి "మహానుభావా! నా పుణ్యం కొలదీ నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను.

                నాజన్మ తరించింది. నాయిల్లు పావనమైంది. శక్తికొలదీ నే జేయు సత్కారములను స్వీకరించి తమరువచ్చిన కార్యమును విశదీకరింపుడు" అని సవినయుడై వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి "ఓ ధర్మవీరా! నేను నోకొక హితవు చెప్పదలచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైన దినము.

           ఆరోజున స్నాన, దాన, జపాదులు ఏవి చేసిననూ అత్యంత ఫలం కలుగును. నాలుగు జాతులలో నేజాతివారైననూ - స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రతయైనా, వ్యభిచారిణియైనా కార్తీక శుద్ధ ద్వాదశిరోజున సూర్యుడు తులారాశియందు వుండగా నిష్ఠగా ఉపవాసముండి, సాలగ్రామదానములు చేసినయెడల వెనుకటి జన్మలందూ, ఈ జన్మలందూ చేసిన పాపములు పోవును.

         నీతండ్రి యమలోకంలో మహానరక మనుభవిం చుచున్నాడు. అతనిని వుద్ధరించుటకై నీవు సాలగ్రామదానము చేయక తప్పదు. అట్లు చేసి నీతండ్రి ఋణం తీర్చుకొనుము" అని చెప్పెను. అంతట ధర్మవీరుడు "నారద మునివర్యా! నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని.

            అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగనప్పుడీ "సాలగ్రామ" మనే ఱాతిని దానము చేసినంత మాత్రమున ఆయన యెట్లు వుద్ధరింపబడునా యని సంశయము కలుగుచున్నది. దీనివలన ఆకలిగొన్నవాని ఆకలితీరునా! దాహంగొన్న వానికి దాహం తీరునా? కాక, యెందులకీ దానము చేయవలయును? నేనీ సాలగ్రామదానము మాత్రము చేయజాల"నని నిష్కర్షగా పలికెను.

         ధర్మవీరుని అవివేకమునకు విచారించి "వైశ్యుడా! సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితినివి. అది శిల కాదు. శ్రీహరి యొక్క రూపము. అన్నిదానములకంటె సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధనుండి విముక్తి గావింప నెంచితివేని, యీ దానముతప్ప మరొక మార్గము లేదు" అని చెప్పి నారదుడు వెడలిపోయెను.

            ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు, దానసామర్ధ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుటచేత మరణాంతర యేడు జన్మల యందు పులియై పుట్టి, మరిమూడు జన్మలందు వానరమై పుట్టి, ఐదుజన్మలు ఎద్దుగా పుట్టి, పదిజన్మలు మానవ స్త్రీగా పుట్టి, పది జన్మలు పందిగా జన్మించి యుండెను.

          అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రహ్మణుని యింట స్త్రీగా పుట్టాగా ఆమెకు యౌవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను.

             చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు సంభవించి నందులకు తల్లితండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు యెందువలన కలిగె నాయని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి "నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక" యని చెప్పించి సాలగ్రామ దానఫలము ధార వోయించెను.

                  ఆరోజు కార్తీక సోమవారమగుట వలన ఆ సాలగ్రామ దానఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి, జన్మాంతరమున స్వర్గమున కరిగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచు ముక్తినొందెను.

             కావున, ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దానఫలము యింతింత గాదు. ఎంతో ఘనమైనది. కావున నీవును అ సాలగ్రామ దానమును చేయుము."


- స్వస్తీ...