👉ఎవడు ఎన్ని చెప్పినా… ఎవరు ఎన్ని విధాలుగా ప్రభావితం చేసినా మన జీవితం అనేది మన చేతుల్లో ఉండాలి… మన పక్కన ఉన్నవాడు ప్రభావితం చేస్తే… ఆ ప్రభావాన్ని కొంత వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలి… ఎందుకంటే మనిషి జీవితం చాలా విలువైనది… దిశ హత్య కేసు నిందితుల విషయానికి వచ్చి ఒక్కసారి చూద్దాం… వాళ్ళల్లో ఎవరికీ 25 ఏళ్ళు దాటలేదు. ఇద్దరికి మీసాలు కూడా రాలేదు… కానీ  ఒక వ్యక్తి ప్రభావంతో వాళ్ళు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. వాళ్ళు ఆ కాసేపు ఏం కోరుకున్నారో…

👉వాళ్లకి ఆ కాసేపట్లో ఏం దొరికిందో… వాళ్ళు అనుభవించింది ఏంటో వాళ్ళకే తెలియాలి… ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న వయసులు వారివి… కాని ఆరిఫ్ అనే వ్యక్తి స్నేహంలో పడి… అతనిని అన్నా ..అన్నా అంటూ వెంట తిరిగి తమ  జీవితాలను మిగిలిన ముగ్గురు నాశనం చేసుకున్నారు.  పోలీసులు కూడా ఆరిఫ్ ని విచారించిన సమయంలో అతనిలో భయం గాని..బాధ గానీ...పశ్చాతాపం గాని లేదని ఆశ్చర్యపోయారు. స్నేహం అనేది దొరకడం ఈ రోజుల్లో చాలా సులువు… కాని ఆ స్నేహాలు మనల్ని ఎటు వైపు నడిపిస్తున్నాయి…?

👉వాటి కారణంగా మనం ఎటు వెళ్తున్నాం?. అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి… మద్యం మత్తులో ఒక నిండు జీవితాన్ని నాశనం చేసి… ఆ పది నిమిషాల కోసం నలుగురు తమ నిండు జీవితాలను నాశనం చేసుకున్నారు. సమాజంలో వాళ్ళ చావు సంబరాలు చేసుకునే వరకు తీసుకెళ్ళారు… వాళ్ళు పెరిగిన కుటుంబ పరిస్థితులు, వాళ్ళు పొట్ట కూటి కోసం చేసే పనులు,

👉వాళ్ళను నడిపించిన కారణాలు… ఏమైనా అయి ఉండవచ్చు… కానీ మద్యం మత్తులో వాళ్ళు చేసిన పని ఇప్పుడు వాళ్ళ జీవితాలనే కాదు… వారి కుటుంబాలనూ  నిర్వేదంలోకి నేట్టేసాయి. ఆ నలుగురి కుటుంబాలకు ఇప్పుడు సమాజంలో విలువ ఉండదు. తల్లి తండ్రులను చూసే దిక్కు ఉండదు. వారిలో ఒకరికి భార్య ఉంది… ఆమె పరిస్థితి ఏంటో ఆమె భవిష్యత్తు ఏంటో తెలియదు… ఆమె గర్భిణి… ఆమెకు పుట్టబోయే బిడ్డ లోకాన్ని చూడక ముందే… తండ్రిని కోల్పోయింది. కాబట్టి చేసే ప్రతి పనిలో, ఆలోచించే ప్రతీ ఆలోచనలో కూడా విజ్ఞత అనేది చాలా అవసరం.

👉మనిషికి ఒక్కటే జీవితం… ఒక మనిషి గా ఆలోచిస్తే వాళ్ళ మీద ఎక్కడో ఒక జాలి అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్లకు జీవితం అంటే ఏంటో తెలీదు. నేడు తల్లి తండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్ళారు. కన్న పేగు కూడా వాళ్ళని క్షమించొద్దు అని చెప్పింది… స్నేహాలు చేసే ముందు ఆలోచించండి… ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం… మళ్ళీ జన్మ ఉంటదని ఎవడు చెప్పినా సరే అది అబద్దం… ఉన్న జీవితాన్ని మీకు ఉన్న వసతులతో ఇబ్బందులతోనైనా అనుభవించండి… కాని ఇలా మాత్రం ప్రవర్తించి మిమ్మల్ని మీరు శాశ్వతంగా కోల్పోవద్దు…!

👉చివరగా  నేటి సమాజానికి చెప్పిన విలువైన సలహా…

👉పిల్లలు ఏం చేస్తున్నారు ఎటు తిరుగుతున్నారు, ఎవరితో ఎలాంటి సావాసాలు చేస్తున్నారు అనేది తల్లి తండ్రులు ఆలోచించాలి, అలాగే మనం ఎవరితో తిరుగుతున్నాం తిరిగే వ్యక్తి మనస్తత్వం, వ్యక్తిత్వం, వృత్తి ఏంటి, అతని చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి, పిల్లలు పని చేస్తున్నారు కదా డబ్బులు తెస్తున్నారు కదా అని వాళ్ళను వదిలేస్తే వాళ్ళు ఏం చేసినా చివరికి నష్టపోయేది తల్లి తండ్రులే. మనం డబ్బులు తెస్తున్నాం కదా, సంపాదిస్తున్నాం కదా అని,
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే… డబ్బులు గాని, సుఖాలు గాని ఏ ఒక్కటి శాశ్వతం కాదు… మీ కుటుంబ పరిస్థితుల కారణంగా మీరు ఏ విధంగా అయినా కష్టపడొచ్చు… కాని చేసే స్నేహాల విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచించుకోండి… చేసుకునే అలవాట్ల విషయంలో కూడా ఒకటికి పది సార్లు జాగ్రత్తగా ఆలోచించండి. మన జీవితానికి మనదే బాధ్యత… డబ్బుతో పాటు సమాజంలో ఎలా ఉండాలి అనే విజ్ఞానం కూడా సంపాదించుకోండి… పది మందిని చూసి మంచి నేర్చుకోండి… మీ జీవితాన్ని మీరే సక్రమమైన మార్గంలో పెట్టుకోండి.... 



- స్వస్తీ...