అనగనగా ఓ రాజు. 

ఆ రాజు పేరు అమరశక్తి రాజు.

అతనికి చెప్పుకోలేని కష్టం వచ్చి పడింది. 

అదేమిటంటే… 

ముగ్గురు కొడుకులున్నారతనికి. 

ఆ కొడుకులికి ఆటలంటే ఇష్టం. 

పాటలంటే ఇష్టం. 

చదువంటేనే ఇష్టం లేదు. 

బాగా చదువుకుని, శాస్త్రాలని ఒంటబట్టించుకుంటేనే కదా, గొప్పవారూ, రేపటి రాజులవుతారు. 

కాని చదువంటేనే ఇష్టం లేదు వాళ్ళకి. 

అలా అని శుద్ధ మొద్దులా అంటే కాదు, బుద్ధిమంతులే!

రాజుగారు ఈ బాధలోనే కొలువు తీరారు. 

పండితులతోనూ, విద్వాంసులతోనూ రకరకాల చర్చలు చేశారు. 

ఆ సందర్భంలో ఓ పండితుడు ఇలా అన్నాడు.

‘‘మనిషి డబ్బుతోనూ, అధికారంతోనూ, యవ్వనంతోనూ, అవివేకంతోనూ జాగ్రత్తగా ఉండాలి. 

లేని పక్షంలో ఈ నాలుగింట దేనితోనయినా చెడిపోయే ప్రమాదం ఉంది. 

కలగలిసి నాలుగూ ఉన్న వాడూ ఇట్టే చెడిపోతాడు. 

అందుకనే మనిషన్నవాడు బాగా చదువుకోవాలి. 

చదువుకుంటే తెలివితేటలూ. వివేకజ్ఞానం అలవడి, చెడిపోకుండా ఉంటాడు. 

మనిషికి విద్య కన్నులాంటిది. 

ఆ కన్ను లేకపోతే కష్టం. 

బతుకంతా చీకటే’’....

పండితుని మాటలతో రాజు బాధ రెట్టింపయింది. 

కొలువు చాలిస్తున్నామని చెప్పి, చరచరా అంతఃపురానికి వెళ్ళిపోయాడు. రాజు, 

కొలువుని ఇలా మధ్యలో ముగించిన సందర్భాలు లేవు.

ఉత్సాహంగా కొలువు తీరే రాజు, ఇటీవల నిరుత్సాహంగా కొలువు తీరడం, ఏదో బాధలో ఉన్నట్టుగా కనిపించడం పండితుల్నీ, విద్వాంసుల్నే కాదు, మంత్రి రాజదత్తుణ్ణి కూడా కలచి వేసింది.

పిల్లల అరుపులూ కేకలూ వినవస్తోంటే అంతఃపురం కిటికీలో నుండి కిందకి చూశాడు రాజు. 

ఉద్యానవనంలో తన నలుగురు కొడుకులూ అల్లరిగా ఆడుకోవడం కనిపించింది. కన్నీళ్ళొచ్చాయతనికి. 

ఎంచక్కా చదువుకున్నవారు పిల్లలు కాని, వీళ్ళేం పిల్లలు? 

వీళ్ళ వల్ల తల్లిదండ్రుకు పేరు ప్రఖ్యాతులు రావు సరికదా, దుఃఖం ముంచుకొస్తుంది. 

తళుకు బెళుకు రాళ్ళు తట్టెడు ఉండడం కన్నా, ఒక్క రత్నం చాలంటారు. 

అలాగే కౌరవ సంతానంలా వందమంది మూర్ఖులు కొడుకులుగా ఉండే కంటే ఒక్కడు… ఒక్కడంటే ఒక్కడు గుణవంతుడు, ధర్మరాజులాంటి వాడు ఉంటే చాలనుకున్నాడు రాజు. 

దేనికయినా ప్రాప్తం ఉండాలి. 

గుణవంతులూ, విద్యావంతులూ అయిన పిల్లలుండాలంటే గతజన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలనుకున్నాడు. 

అంతలోనే కళ్ళు తుడుచుకుని, దీర్ఘంగా ఆలోచించసాగాడు.

కథలు ముగించాడు దమనకుడు. 

సమాధానం కోసం సంజీవకుణ్ణి చూశాడు.


బాధపడి లాభం లేదు. 

పరిష్కారమార్గాన్ని కనుక్కోవాలనుకున్నాడు. 

మంచి గురువుల దగ్గర చదివిస్తే పిల్లలెందుకు చదవరు? 

చదవనని వారనలేదే! 

చదివించడం లేదు కాబట్టే వారాడుతున్నారు. 

తప్పు తనదే! గారాబం చేసి, అప్పుడే పిల్లలకు చదువులెందుకనుకుంటూ నిర్లక్ష్యం చేసి, ఇప్పుడు బాధపడడంలో అర్థం లేదనుకున్నాడు.

 పిల్లలకు చదువు చెప్పించడం తల్లిదండ్రుల బాధ్యత. 

సరయిన గురువు దగ్గర వారిని చదివించాలి. 

చదివించకపోవడం నేరం కూడా అనుకున్నాడు. 

పుట్టుకతోనే ఎవరూ పండితులు కారు. 

విద్వాంసులు అంతకన్నా కారు. 

బాగా చదువుకుని పండితులవుతారు. 

తర్వాత్తర్వాత విద్వాంసులుగా కీర్తి ప్రతిష్ఠలు ఆర్జిస్తారు. 

ప్రయత్నించాలి. 

ప్రయత్నిస్తేనే ఏదయినా ఫలిస్తుందనుకున్నాడు. 

వూరికే దిగులుపడి ప్రయోజనం లేదు. 

అడవికి రాజయినా సింహం వేటాడే ఆకలి తీర్చుకుంటుంది. 

రాజునని నోరు తెరచి కూర్చుంటే పనిమాలా ఏ జంతువూ వచ్చి నోట్లో పడద నుకున్నాడు. 

పిల్లలకి త్వరలోనే మంచి గురువుని వెదకాలనుకున్నాడు.

మర్నాడు కొలువు తీరాడు రాజు. 

ఉత్సాహంగా కనిపించాడు. 

అతనలా ఉత్సాహంగా కనిపించడంతో పండితులకీ, విద్వాంసులకీ సంతోషమనిపించింది. 

అందరికీ నమస్కరించాడు రాజు. 

ఇలా అడిగాడు.

‘‘ఆటలలో మునిగి తేలుతూ చదువన్నదే పట్టించుకోని నా పిల్లలకి, రేపటితరం రాజులకి నీతిశాస్త్రాన్ని బోధించాలి.

 వారిని నన్ను మించేలా తీర్చిదిద్దాలి. 

అలా తీర్చిదిద్దే సమర్థత కలవారు మీలో ఉన్నారా?’’ఉన్నారని చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాలలేదు. 

రాజు భయపడసాగాడు. 


అప్పుడు...

ఒక మంత్రి విష్ణుశర్మ అనే గురువు గురించి చెప్పి అతనికి రాకుమారులను అప్పగింపుమని సలహా ఇచ్చాడు.

రాజు విష్ణుశర్మను పిలిపించి, రాకుమారుల చదువు విషయమై తన వేదనను వివరించి, ‘నా బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పండి, మీకు తగిన పారితోషికం ఇస్తాను’ అని అన్నాడు. 

విష్ణుశర్మ బదులిస్తూ ‘నేను విద్యను అమ్ముకోను, నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను, నాకే విధమైన పారితోషికం అవసరం లేదు’  అని చెప్పాడు..

ఆనందంగా చూశాడు రాజు.

‘‘కొంగకు మాటలు నేర్పడం కష్టంకాని, చిలుకకు మాటలు నేర్పడం కష్టం కాదు మహారాజా! 

రాకుమారులు చిలుకలవంటివారు. 

అలాగే వజ్రాల గనిలో గాజుపెంకులుండవు. 

అంటే…మీ రాజవంశంలో గుణహీనులు ఉండే అవకాశం లేదు.’’పొంగిపోయాడు రాజు.

‘‘వజ్రాన్నయినా సాన పెడితేనే ప్రకాశిస్తుంది. 

అలాగే ఎంత రాకుమారులయినా వారికీ తగిన గురువు అవసరం. 

ఆ గురువుని నేనేనని నాకనిపిస్తోంది. 

అన్యధా భావించక రాకుమారులను ఓ ఆరు నెలలపాటు నాకు అప్పగిస్తే నేను వారిని మంచి మార్గంలో పెడతాను. 

విద్యాబుద్ధులు నేర్పుతాను.’’ అన్నాడు విష్ణుశర్మ.

సింహాసనం మీద నుంచి లేచి నిల్చున్నాడు రాజు. 

గబగబా నాలుగడుగుల్లో విష్ణుశర్మను సమీపించాడు.

అతని చేతులందుకున్నాడు. 

ఇలా అన్నాడు.‘‘తిరుగులేదు. 

మీ వంటి పండితుల దగ్గర విద్య నేర్చుకుంటే నా కుమారులకు తిరుగులేదు. 

యోగ్యులవుతారు. 

పూలు కట్టిన దారానికీ పూల సుగంధం అబ్బినట్టు, సజ్జనునితో తిరిగిన సామాన్యుడు కూడా సజ్జనుడు అయినట్టుగా నా కొడుకులు మీ శిష్యరికంలో గొప్పవాళ్ళవుతారు. 

అనుమానం లేదు. 

ఈ క్షణం నుంచి రాకుమారుల్ని మీ చేతుల్లో ఉంచుతున్నాను. 

వారి కళ్ళు తెరిపించాల్సిన బాధ్యత మీదే’’‘‘తప్పకుండా’’ అన్నాడు విష్ణుశర్మ.

ఓ మంచి ముహూర్తాన రాకుమారుల్ని వెంటబెట్టుకుని వెళ్ళాడు. 

వారిలో ఒకడిగా ఆడి పాడి, తర్వాత వారితో ఇలా అన్నాడు విష్ణుశర్మ.

‘ఆడాడి బాగా అలసిపోయాం కదా! ఇప్పుడు మనం కథలు చెప్పుకుందాం. 

మంచికథలు, నీతికథలు చెప్పకుందాం. 

మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం అంటూ రకరకాల కథలు చెప్పుకుందాం. 

మీకిష్టమేనా’’‘‘ఇష్టమే’’ అన్నారు రాకుమారులు.

విష్ణుశర్మ కథలు చెప్పడం ప్రారంభించాడు…


అవే ఈ  పంచతంత్ర కథలు