ఏది చేస్తే అదేయ్ పొందుతాం..!


  స్వార్థంతో  మనిషి ఉన్నప్పుడు  కలిసి రాదు ! 

ఎప్పుడైతే ఇతరుల గురించినీవు ఆలోచిస్తావో      

నీకు అప్పుడే మంచి జరుగుతుంది.

      ఒకసారి  శ్రీకృష్ణార్జునులు  కలిసి వెళ్ళుచుండగా వారికి మార్గమధ్యమున పేద సజ్జనుడు యాచకుడుగా   కనిపించాడు. 

జాలి పడిన అర్జునుడు ఒక సంచెడు బంగారునాణెములుఇచ్చాడు. 

సంతోషముగా ఇంటికి   వెళ్ళుచుండగాఘ మార్గమధ్యములో ఒకదొంగ ఆసజ్జనుని కత్తితో బెదిరించి   నాణెముల సంచిని లాక్కున్నాడు...


    మరలా ఆపేద సజ్జనుడు యాచకుడి గా మారి భిక్షాటనచేయనారంభించాడు 

ఓరోజు అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్య పోయి, విషయము తెలిసికొని  జాలిపడి ఓ   ఖరీదైన వజ్రం   ఇచ్చి సుఖంగా జీవింపుమని చెప్పాడు .


  ఆసజ్జనుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసికొని వెళ్ళి గదిలో మూలన ఉన్న ఒక కుండలో   వజ్రాన్ని దాచిపెట్టి  ఆ రాత్రి నిద్రించాడు.

తెల్లవారి చూస్తే   ఇంట్లో భార్యలేదు .   

 అంతేకాదు  ఆ కుండ కూడా లేదు.

పరుగెత్తుకుంటూనదీ తీరం వద్దకు వెళ్ళాడు . 

భార్యను, ఆమె చేతిలోని  కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు . 

కుండలో చూస్తే వజ్రం లేదు .



    నదిలో  నీళ్ళకోసం   ముంచినప్పుడు నదీ ప్రవాహములో   కొట్టుకు పోయింది. 

తన దురదృష్టానికి  ఎంతో చింతించిన ఆ సజ్జనుడు    మళ్ళీ  యాచకుడుగా వీధుల్లోకి వెళ్ళవలసి వచ్చింది .


      కృష్ణార్జునులు ఆతనిని  చూసి ఏమైందని విచారించారు.

ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అని అర్జునుడు  శ్రీకృష్ణునితో  అన్నాడు. లేదు .

ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం అని  సజ్జనుని చేతిలో  రెండు బంగారు నాణాలు పెట్టారు .



    ఒకప్పుడు సంచెడు నాణేలు, ఎంతో విలువైన వజ్రం  నా దగ్గర నిలువలేదు. 

ఈ రెండు నాణేలు  మ నా  తలరాతను మారుస్తాయా నాపిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు ఆ సజ్జనుడు...



      దారిలో  ఒక జాలరి    వలకు   చిక్కి విలవిల లాడుతున్న చేపను చూశాడు . 

అతని హృదయము ద్రవించింది.  

నా దగ్గరున్న రెండునాణేలు నాతలరాతను మార్చలేవు కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం అని  తన దగ్గరున్న రెండు నాణేలు    ఇచ్చేసి     ఆ   చేపను తీసుకొని ఇంటికి వెళ్లి   ఒక నీటి తొట్టిలో వేశాడు...



    కొద్ది సేపటికి ఆతని భార్య ఆ చేపను చూసి  అయ్యో !    

దీని నోటిలో ఏదో ఇరుక్కుంది అందుకే ఇది ఇలా గిలగిలా కొట్టుకొను చున్నదని   భర్తకు   చెప్పింది. 

ఇద్దరూ కలసి   ఆ చేప నోరుతెరవగా నదిలో పోగొట్టుకొన్న ఆ వజ్రం చేప నోట్లో కనిపించగానే  'దొరికింది దొరికింది చిక్కింది  చిక్కింది  నాచేతికి  చిక్కింది ' అని గావుకేకలు పెట్టారు... 


      ఆ సయములో  ఆతని ఇంటిలో దూరియున్న దొంగ ఆ సజ్జనుని చూసి భయంతో ఆసజ్జనుడు తననే  కనిపెట్టా డని వణికిపోయాడు .

ఆ సజ్జనుని దగ్గరకు వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు సంచి  నీవు తీసుకో నన్ను మాత్రం  రాజభటులకు పట్టివ్వ వద్దని బ్రతిమాలాడు.

ఆ దంపతులు ఆశ్చర్యపోయారు.    

పోగొట్టుకొన్న రెండు విలువైన వస్తువులు  తమకు చేరాయని ఆనందపడినారు .


వెంటనే వెళ్లి ఈ విషయాన్ని కృష్ణా ర్జునులకు చెప్పారు.


      'కృష్ణా ! నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేల సంచి , వజ్రం ఇచ్చినా అతని దశ తిరుగలేదు .       


 నీవు ఇచ్చిన  రెండు నాణేలు   అతని  జీవితాన్ని మలుపు తిప్పినాయి. 

ఇదెలా సాధ్యం?' అని ప్రశ్నించాడు అర్జునుడు .


శ్రీకృష్ణుడు ఇలా సెలవిచ్చారు ....


 ' అర్జునా! అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు   అతను తన  అవసరాలు గూర్చి మాత్రమే ఆలోచించాడు . 

రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి - చెడు , కష్ట - సుఖములు గూర్చి     ఆలో చించాడు . 

నిజానికి అది  భగవంతుని పని .  

  అతను దేవుని పనిని పంచు కున్నాడు కాబట్టి   ఆతని  కష్టములను అన్నిటిని నేను పంచుకున్నాను.




- స్వస్తీ...