రేపు శ్రీ సత్యసాయి బాబా వారి జన్మోత్సవం సంధర్భంగా...






సత్యసాయి బాబా వారి జీవనయానం


కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబర్‌లో 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణ రాజు. బాబా జన్మించింది గోవర్ధనపల్లిలో అదే ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడి సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకున్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన తర్వాత ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా చేస్తున్న సేవలను ఎవరూ వేలెత్తి చూపించలేక పోయారు.

కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ఇతర మతాల వారు చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్దవెంకమ రాజు రత్నాకరమ్. బాబాకు నలుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. బాబా చిన్న వయసులోనే చాలా అద్బుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే బాబా అపర మేధావి, సేవాభావం గల వ్యక్తిగా ముద్ర పడ్డారు. అపర మేథావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులను వినిపించాడు.

1940వ సంవత్సరం మార్చి 8వ తేదిన తన సోదరుడు శేషమ రాజుతో కలిసి ఉరవకొండలో ఉన్న సమయంలో బాబాను ఓ తేలు కుట్టిందంట. ఆ సమయంలో బాబా తన స్పృహను కోల్పోయారంట. తేలు కుట్టిన కొద్ది రోజులకు బాబా బిహేవియర్‌లో మార్పు వచ్చింది. తనకు తాను నవ్వుకోవడం, ఏడ్వటం, అప్పటికప్పుడే నిశ్శబ్దంగా మారి పోవడం చేసేవారు. ఆ సమయంలో ఇతను తనకు ఇంతకుముందు ఏ మాత్రం పరిజ్ఞానం లేని సంస్కృతంలో పాటలు పాడేవారు. బాబా పరిస్థితి చూసి వైద్యులు హిస్టేరియా అని నమ్మేవారు. దీంతో చేసేది లేక బాబా తల్లిదండ్రులు బాబాను పుట్టపర్తికి తీసుకు వచ్చారు. వారు బాబాను అనేకమంది వైద్యుల వద్దకు, ఆధ్యాత్మిక గురువుల వద్దకు తీసుకు వెళ్లారు.

మే 23 1940లో బాబా చేసిన ఓ చర్య వల్ల బాబా తండ్రి బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడుగా భావించాడు. బాబా తండ్రి ఓ కర్ర తీసుకొని నీవెవరు అని అడిగాడు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పాడు. ఆ తర్వాత బాబా తనకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పారు. తాను షిర్డీ సాయికి ప్రతిరూపం అని చెప్పడం, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో ఆయనకు భక్తులు తయారవడం ప్రారంభం అయింది. పద్నాలుగేళ్లకే బాబా ఆధ్యాత్మిక మార్గం పట్టారు. ఆ తర్వాత సత్యసాయి మద్రాసుకు, దక్షిణ భారతంలో పర్యటనలు ప్రారంభించారు. దీంతో తొందరగానే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు.

1944వ సంవత్సరంలో భక్తులు బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభం అయిన ప్రశాంతి నిలయం 1950కి పూర్తయింది. 1957వ సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారత దేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1954లోనే బాబా చిన్న పాటి గ్రీన్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1963లో బాబాకు నాలుగుసార్లు గుండెనొప్పి వచ్చింది. ఆ సమయంలో బాబా తాను మరణించాకు కర్ణాటకలో ప్రేమసాయి అవతారం ఎత్తుతానని చెప్పారు.

ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. ఉగండా, నైరోబీ తదితర దేశాలకు వెళ్లారు. ఆయా దేశాలకు వెళ్లిన బాబా తాను ఏ మతపరంగా రాలేదని ప్రేమను పంచడానికే వచ్చానని చెప్పారు. తనవైపు ఎవరినీ తిప్పుకోవడానికి, ప్రలోభ పెట్టడానికి రాలేదని, కేవలం ప్రేమ పంచి, ఎవరిపై వారికి నమ్మకం కలిగించడానికే వచ్చానని ఆయా దేశాలలో చెప్పేవారు.

మన రాష్ట్రం రాజధానిలో ప్రసిద్ధి పొందిన శివం మందిరాన్ని 1973లో ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. బాబా 2005వ సంవత్సరం నుండి వీల్ చైర్‌కే పరిమితం అయ్యారు. తాను దేహం కలవాడిని కాదని, దేహిని అని చెప్పారు. తాను నిర్మాణం చెందినప్పటికీ మళ్లీ పుడతానని పలు సందర్భాలలో చెప్పారు. అయితే భక్తుల ప్రార్థనలే తనకు ప్రాణం అని కూడా చెప్పారు. ప్రతి దేహం గిట్టక తప్పదని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులను, వేల సేవాకేంద్రాలు, ప్రజలకు నీటి సౌకర్యం కల్పించిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా తాను స్థాపించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే చికిత్స తీసుకొని. 28 రోజుల అనంతరం బాబా ఆదివారం ఏప్రిల్ 24న ఉదయం 7.40 నిమిషాలకు నిర్యాణం చెంది బాబా భక్తులలో విషాదం నింపారు.



- స్వస్తీ...