సమ్యక్ భాషణం వ్యక్తికి భూషణం. 




కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా:

నాన్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్.

ఎన్ని మణిమయ హారాలు ధరించినా అవి మనుషులకు అలంకారాలు కావు. ఎన్ని సుగంధాలు పూసుకొన్నా, ఎన్ని పూవులు ధరించినా, అవి మనిషికి అలంకారాలు కావు. చక్కని వాక్కుకి మించిన అలంకారం లేదు సుమా ! వాక్ భూషణమే భూషణం.


ఈ సంస్కృత శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదం :




భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్


భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ కలాభిషేకముల్

భూషలు కావు, పూరుషుని భూషితుఁ జేయు ( బవిత్రవాణి వా

గ్భూషణమే భూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

అంచేత, మంచిగా మాట్లాడడమే మనిషికి అలంకారం. దేవుడు నోరిచ్చాడు. మాట యిచ్చేడు, ఆలోచన యిచ్చేడు ... కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడితే పోయేదేమీ లేదు కదా.

నోరు నొచ్చేలా శ్రీహరిని కీర్తించవయ్యా మగడా అని చెప్పేడు పోతన. మనం వింటామా. అంత సీన్ లేదు కానీ, రోజూ నాలుగు మంచి మాటలయినా పలుకుతున్నామా ? ఆలోచించాలి.

మృదువుగా మాట్లాడితే ఎవరయినా వింటారు. అలాగని పలుకులలో తేనె లొలుకుతూ, మదిలో విషాన్ని నింపుకొని ఉండడంకూడా సరికాదు.

అసలు మన మూడ్స్ బట్టి మనం మాట్లాడే ధోరణి కూడా ఉంటుందేమో ...

విసుగ్గా ఉన్నప్పుడు ఇల్లు కాస్తా కొంప అవుతుంది !

భోజనం కాప్తా పిండాకూడవుతుంది !

ఊరు కాప్తా వల్లకాడవుతుంది ! 

ఎదుటి వాళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళే అవుతారు !

అంచేత విసుగుని తగ్గించు కొని శాంతంగా అందరితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.



- స్వస్తీ...