కార్తీక పురాణం 17వ అధ్యాయము 


అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము : 


             ఓ మునులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము. కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది. శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది. కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం. స్తూల, సూక్ష్మ శరీరసంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను.

         దానిని మీకు వివరిస్తాను. 'ఆత్మ' అంటే ఈ శరీరము నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా... 'ఓ మునీంద్రా! నేనింతవరకూ ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను. కనుక, ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్ధజ్ఞానము కారణమగుచుండును.

         కాన, 'అహంబ్రహ్మ'యను వాక్యార్ధమును గురించి నాకు తెలియజేయండి' అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగెను. ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, నేను-నాది అని చెప్పబడు జీవాత్మయే 'అహం' అను శబ్దము. సర్వాంతర్యామి అయిన సచ్చిదానందరూపమైన పరమాత్మ 'న:' అను శబ్దము.

          ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు. అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని ముందు తెలుసుకోవాలి. దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది. దేహానికి జగత్, స్వప్న, సుషుప్త్యవస్థలు స్థూల, సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను, నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకొమ్మని చెబుతాడు.

          ఇనుము సూదంటురాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీరం, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అదే విధంగా అవి ఆత్మ వలన తమ పని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధంలేక గాఢనిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖముగా ఉన్నది అనుకొనేదే ఆత్మ.

              దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది. ఆత్మ పరమాత్మ స్వరూపమ గుటవలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ'యని గ్రహింపుము.

       'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునకు కించిత్ జ్ఞత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం. 'తత్' అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. 'తత్వమసి' అనేది జీవాత్మపరమాత్మల యేకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపమొక్కటియే నిలుచును.

          అదియే 'ఆత్మ'. దేహలక్షణము లుండుట-జన్మించుట-పెరుగుట-క్షీణించుట-చచ్చుట మొదలగు ఆరుభాగములు శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహించునో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి. జీవుల కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడు పరమాత్ముడని, జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి.

         అందువల్ల మానవుడు మంచిగుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశలనుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి. సత్కర్మానుష్ఠానం చేయాలి. మంచి పనులు చేస్తే గానీ ముక్తి లభించదని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయాల్సిన ఆవశ్యకతను గురించి చెబుతాడు. అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అనెను.

 సప్తదశాధ్యాయము పదిహేడవ రోజు పారాయణం సమాప్తం.