శివరాత్రి ..”శివ” అంటే “శివుడు;  – “రాత్రి” అంటే “పార్వతి”

వీరిద్దరికీ వివాహమైన రాత్రే “శివరాత్రి”. 

వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.

అందుకే పార్వతీపరమేశ్వరులను “ఆదిదంపతులు” అన్నారు. 

వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే “శివరాత్రి” విశ్వానికంతటికీ పర్వదినం అయింది.

అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ “శివరాత్రి” నాడే. 

అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని “లింగోద్భవ” కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.

ఈ శివరాత్రి పర్వదినం నాడే “శివపార్వతులకు” కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.

అభిషేకం ఎందుకు చేయాలి ?

”అభిషేక ప్రియం శివః” అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.

ఇందులో అంతరార్థం ఏమిటంటే - “నీరము” అంటే “నీరు” నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును “నారాయణుడు” అన్నారు.

 నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు “నీరు” అంటే చాలా యిష్టం.

అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో

“శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః”

శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ … చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. 

కానీ ఈ అభిషేకాలన్నింటికన్న “జలాభిషేకం” అంటేనే శివునకు ప్రీతికరం.

అందులోనూ “గంగా జలాభిషేకం” అంటే మహా యిష్టం. 

ఎందుకంటే “గంగ” “విష్ణుపాదోద్భవ” విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం,

 అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.

ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం “చితాభాస్మాభిషేకం” ఎందుకంటే ఆయన “చితాభస్మాంగదేవుడు” కదా!

 ఈ అభిషేకం, ఉజ్జయినిలో “మహాకాలేశ్వరునికి” ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.

ఏది ఏమయినా, శివాభిషేకం … సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం …

ఎందుకంటే ”జలధార శివః ప్రియః” అన్నారు కదా!

 ఈ అభిషేకాన్ని “రుద్రైకాదశిని” అనబడే నమక, చమకాలతో చేయాలి. 

అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.

నమకంలోని “నమశ్శివాయ” అను పంచాక్షరీ మంత్రంలో ”శివ” అనే రెండు అక్షరాలు “జీవాత్మ” అనే హంసకు రెండు రెక్కలవంటివి.

 జీవుని తరింపజేయడానికి ”శివాభిషేకం” అత్యంత ఉత్తమైన సులభమార్గమని, “వాయుపురాణం” చెబుతుంది.

“వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః” అనునది సూక్తి. 

దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది.

 నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.

అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. 

అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.

“శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |
ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||
యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||

శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి,
 ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి,
 సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క “శివరాత్రి” అర్చనవలన లభిస్తుందని” “శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.

శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, 

ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. 

మరునాడు “మాఘబహుళ చతుర్దశి” శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. 

రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. 

లింగోద్భవకాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి.

తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి.

 నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు,

“ఓం నమశ్శివాయ” అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.

బిల్వపత్రాల విశిష్టత.💐

శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం … అని శాస్త్రప్రమాణం.

మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.

సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,

వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం,

 ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని ”బిల్వాష్టకం” లో చెప్పబడింది.

“ఏకబిల్వం శివార్పణం” అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.

బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. 

ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. 

బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.


ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి.

 ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. 

కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.



జాగరణ ఎందుకు చేయాలి..💐

క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు …

 మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో … అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. 

ఆ జాగరణే “శివరాత్రి”నాడు భక్తులు ఆచారమైంది.

“జాగరణ” అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, గడపడం కాదు. 

జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.

శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు. 

శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.

మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. 

శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.

ఆయన జీవనవృత్తి భిక్షాటనం. 

అందుకనే ఆయనను “ఆదిభిక్షువు” అన్నారు. 

ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. 

ఆయన నివాసస్థానము శ్మశానం. 

ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.

ఈ “నిర్జనుడు” మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. 

ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.

ఈశ్వర భక్తుడైన “రావణుడు” ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.

బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న “గుణనిధి” మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.

అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. 

అదే”శివరాత్రి” మహత్యం.

రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో “సైకతలింగ” ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. 

ఆ క్షేత్రమే “రామేశ్వరం”.

శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన “తిన్నడు” భక్తకన్నప్పగా వాసికెక్కాడు.

ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ “నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలులేనిది ఆయన మమకారం. “శివా”అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.

దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. 

బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. 

ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. 

కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.

దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర… “నీకు నేనున్నారురా దిక్కు” అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు “శివుడు” ఒక్కడే. 

పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి …

 ఆ పరమేశ్వరుడు ఒక్కడే..

ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా “నమశ్శివాయ” అంటూ నమస్కరించడం తప్ప.

అందుకే “మహాశివరాత్రి”నాడైనా మహాదేవుని స్మరిద్దాం. 

మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం

“ఈశానస్సర్వ విద్యానాం – ఈశ్వర స్సర్వభూతానాం – బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.

ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..



- స్వస్తీ...