దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు.
బతుకు తీపి అనేదే ఒక అద్భుతం.
మనం అల్పం అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ తీపి ఉంటుంది.
చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ బతుకు తీపి.
జీవితానికి ఉన్న విలువ అపారం-లౌకికమైన ప్రయోజనాలతో పాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం ` జీవితం ' అనే అంశంలో ఇమిడి ఉంది.
జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావల్సిన నైతికసూత్రాలు, నియమాలుం అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు.
"ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి.
ఈ రెండింటినీ సాధించడమే అసలైన ప్రయోజనం " అన్నది స్పష్టమైన నిర్వచనం.
అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు.
ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బతుకునే పూర్తిచేసుకోవాలనుకుంటాడు.
ఈ ఆత్మహత్యా ప్రయత్నధోరణి ఉద్రేకం వల్ల, ఒత్తిడివల్ల కలుగుతుంటుంది.
జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, `ప్రశాంతత ' అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని పోగుట్టుకుంటున్నాం.
హనుమంతునికి సీతజాడ తెలియక నిరాశతో తిరిగివెళ్ళడం కన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుంటాడు.
కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయట పడ్డాడు.
సక్రమంగా అలోచించాడు.
"వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు "..
ఇది హనుమంతుని మాట.
ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మననం చెస్తే చాలు.
నేటితరం అంతా వాళ్ళ గది గోడల మీదనో, డైరీ మొదటి పేజీలోనో మొత్తానికి హృదయఫలకంపై బలంగా లిఖించుకోదగిన వాక్యమిది.
"చనిపోవడంలో చాలా దోషాలున్నాయి.
జీవించి ఉంటే చాలు శుభాలను చూడవచ్చు " ఒక్కొక్కసారి అంతా శున్యమే అనిపిస్తుంది.
కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కలగవచ్చు.
ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే మిగలదు.
ఈ వాక్యంతో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం ఫలించింది.
అశోకవనంలో సీతజాడ దొరికింది.
ఆశావాదానికున్న సత్ఫలం అది.
"అలలా వచ్చిన దిగులే అంతాకాదు".
తన కుమారులందరూ విశ్వామిత్రుని కారణంగా మరణించాక వసిష్ఠునికి దు:ఖోద్రేకం కలుగుతుంది.
కొండపై నుండి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు.
ఈ లోపల భూదేవి ఆయనను చేతితో పట్టి కాపాడి మందలిస్తుంది.
" ఓ వెర్రీ! చచ్చిపొతే జీవితం తీరిపోతుందా?" అని ప్రశ్నిస్తుంది.
ఇది చాలా సూటి ప్రశ్న.
మరణిస్తే దేహాన్ని కోల్పోతాం.
కానీ మరో ఉపాధితో జీవించక తప్పదు.
అప్పుడు ఇప్పటి ఆత్మహత్యా పాప ఫలాన్ని సైతం అనుభవించవలసిందే.
నిజంగా జీవితం పై విరక్తి వస్తే `శాశ్వతశాంతి ' కి చేరువయ్యేందుకు ఈ జీవితాన్ని వినియోగించుకోవాలి.
ఙ్ఞానాన్ని సంపాదించాలి.
దీనితో తపస్సుచేసి బ్రహ్మఙ్ఞానంతో సుస్థిర శాంతిని పొందుతాడు.
ఈ కథలో జీవుని పరంగా తాత్త్విక స్పృహతో ఆత్మహత్యా ప్రయత్నం అవివేకం అని స్పష్టపరచారు.
ఇలా ధార్మికంగా, లౌకికంగా, తాత్త్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది లేదు.
ముందు మనం - అటు తరువతే లోకం.
బయట వస్తువులపై, వ్యక్తులపై మమకారం, ఆశా పెంచుకొని అవి కోల్పోతే బతుకునే బలి చేసుకొనడం మూర్ఖత్వం.
బయట వస్తువు లభించక ముందూ మనం ఉన్నాం.
అది పోయినా ఉంటాం.
మనల్ని నాశనం చేసుకొనే హక్కు మనకే లేదు.
" ఓర్చినమ్మకి తేటనీరు ' అన్నట్లు సహనానికి ఫలం సౌభాగ్యమే.
- రాంకర్రి
8096339900
- స్వస్తీ...