దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు. 

బతుకు తీపి అనేదే ఒక అద్భుతం. 

మనం అల్పం అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ తీపి ఉంటుంది. 

చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ బతుకు తీపి. 

జీవితానికి ఉన్న విలువ అపారం-లౌకికమైన ప్రయోజనాలతో పాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం ` జీవితం ' అనే అంశంలో ఇమిడి ఉంది. 

జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావల్సిన నైతికసూత్రాలు, నియమాలుం అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు. 

"ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. 

ఈ రెండింటినీ సాధించడమే అసలైన ప్రయోజనం " అన్నది స్పష్టమైన నిర్వచనం. 

అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు. 

ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బతుకునే పూర్తిచేసుకోవాలనుకుంటాడు. 

ఈ ఆత్మహత్యా ప్రయత్నధోరణి ఉద్రేకం వల్ల, ఒత్తిడివల్ల కలుగుతుంటుంది. 

జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, `ప్రశాంతత ' అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని పోగుట్టుకుంటున్నాం.


హనుమంతునికి సీతజాడ తెలియక నిరాశతో తిరిగివెళ్ళడం కన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుంటాడు. 

కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయట పడ్డాడు. 

సక్రమంగా అలోచించాడు. 

"వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు ".. 

ఇది హనుమంతుని మాట. 

ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మననం చెస్తే చాలు. 

నేటితరం అంతా వాళ్ళ గది గోడల మీదనో, డైరీ మొదటి పేజీలోనో మొత్తానికి హృదయఫలకంపై బలంగా లిఖించుకోదగిన వాక్యమిది. 

"చనిపోవడంలో చాలా దోషాలున్నాయి. 

జీవించి ఉంటే చాలు శుభాలను చూడవచ్చు " ఒక్కొక్కసారి అంతా శున్యమే అనిపిస్తుంది. 

కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కలగవచ్చు. 

ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే మిగలదు. 

ఈ వాక్యంతో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం ఫలించింది. 

అశోకవనంలో సీతజాడ దొరికింది. 

ఆశావాదానికున్న సత్ఫలం అది.

"అలలా వచ్చిన దిగులే అంతాకాదు".

తన కుమారులందరూ విశ్వామిత్రుని కారణంగా మరణించాక వసిష్ఠునికి దు:ఖోద్రేకం కలుగుతుంది. 

కొండపై నుండి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు. 

ఈ లోపల భూదేవి ఆయనను చేతితో పట్టి కాపాడి మందలిస్తుంది.

" ఓ వెర్రీ! చచ్చిపొతే జీవితం తీరిపోతుందా?" అని ప్రశ్నిస్తుంది. 

ఇది చాలా సూటి ప్రశ్న. 

మరణిస్తే దేహాన్ని కోల్పోతాం. 

కానీ మరో ఉపాధితో జీవించక తప్పదు. 

అప్పుడు ఇప్పటి ఆత్మహత్యా పాప ఫలాన్ని సైతం అనుభవించవలసిందే.  

నిజంగా జీవితం పై విరక్తి వస్తే `శాశ్వతశాంతి ' కి చేరువయ్యేందుకు ఈ జీవితాన్ని వినియోగించుకోవాలి. 

ఙ్ఞానాన్ని సంపాదించాలి. 

దీనితో తపస్సుచేసి బ్రహ్మఙ్ఞానంతో సుస్థిర శాంతిని పొందుతాడు. 

ఈ కథలో జీవుని పరంగా తాత్త్విక స్పృహతో ఆత్మహత్యా ప్రయత్నం అవివేకం అని స్పష్టపరచారు.

ఇలా ధార్మికంగా, లౌకికంగా, తాత్త్వికంగా ఆలోచించినా జీవితానికన్నా విలువైనది లేదు. 

ముందు మనం - అటు తరువతే లోకం. 

బయట వస్తువులపై, వ్యక్తులపై మమకారం, ఆశా పెంచుకొని అవి కోల్పోతే బతుకునే బలి చేసుకొనడం మూర్ఖత్వం. 

బయట వస్తువు లభించక ముందూ మనం ఉన్నాం. 

అది పోయినా ఉంటాం. 

మనల్ని నాశనం చేసుకొనే హక్కు మనకే లేదు. 

" ఓర్చినమ్మకి తేటనీరు ' అన్నట్లు సహనానికి ఫలం సౌభాగ్యమే.




- రాంకర్రి
8096339900


- స్వస్తీ...