ధర్మో రక్షతి రక్షితః
అన్నాయి మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు.
మరి అలాంటి ధర్మం గురించిన కొన్ని సందేశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
🎯 ఈ సకల చరాచర జగత్తులో ధర్మాచరణను మించిన శ్రేష్ఠమైన మహిమాన్వితమైన కార్యక్రమం మరొకటి లేదు అన్నారు మన పెద్దలు.
🎯 ఈ సమాజానికి నీవు ఏమి ఇస్తావో అదే నీకు తిరిగి దక్కుతుంది.
సమాజానికి, ఇతరులకు నీవు కీడు చేసి నీకు మాత్రం మంచి జరగాలని ఆశిస్తే అది జరగదు.
నీకు కీడే జరుగుతుంది.
ఇదే ధర్మశాస్త్రంలో ఉండే గొప్పతనం.
🎯 నీ ఇంటి ముందు తుమ్మ చెట్టు నాటి దాన్ని పెంచి పోషించి దానికి మామిడి కాయలు కాస్తాయి అని ఆశపడితే అది సాధ్యపడుతుందా? లేదుకదా..
తుమ్మ చెట్టు నుండి తుమ్మ కాయలే వస్తాయి.
అదే ధర్మం అంటే..
🎯 నువ్వు చేసే ప్రతి పనికి తప్పకుండా ఫలితం వస్తుంది.
అది నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేసి ఉంటే నీకు కూడా చెడే జరుగుతుంది.
అయితే అది కొంచెం ఆలస్యం జరుగవచ్చునేమో కానీ.. ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది.
అదే ధర్మమంటే..
🎯 మనం ఒక మంచి మొక్కను నాటి ప్రతిరోజూ దానికి నీరు పోసి పెంచి పోషిస్తే కొద్ది రోజుల తర్వాత అది పెరిగి పెద్దదై నీకు మంచి పూలను, మంచి కాయలను, మంచి పండ్లను తప్పకుండా ఇస్తుంది.
ఇదే సృష్టి ధర్మం.
🎯 నీ సత్ ప్రవర్తనే నీకు శ్రీరామ రక్ష.
నీ ప్రవర్తన సత్యవంతంగా ఉంటే నీకు సత్ఫలితాలు తప్పకుండా వస్తాయి.
కాకపోతే కొంచెం ఆలస్యం జరగవచ్చు కానీ ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది.
🎯 మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి, సక్రమ జీవన విధానాన్ని చూపించేది ఒక్క ధర్మమే.
మనిషికి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించేది కూడా ధర్మమే.
🎯 ధర్మాన్ని మనం కాపాడితే, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది.
7ధర్మాన్ని కాపాడటమంటే నీవు చేసే ప్రతి పనిలోనూ ధర్మంగా ఉంటూ, అన్ని వేళలా ధర్మాన్నే ఆచరిస్తూ ఉండటం.
🎯 ధర్మం మనిషిని మంచి స్థాయిలో నిలబెడుతుందని, అధర్మం వల్ల మనిషి పతన మవుతాడని 'మనుస్మృతి ' చెబుతోంది.
🎯 మనిషి మంచిగా బతకడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఏయే ధర్మాలు పాటించాలో మనకు విపులంగా వివరించి, విశదీకరించి చెప్పింది మహాభారతం.
🎯 నీవు చేసే ఏ కర్మలైతే ఇతరుల మనస్సుకు తనువుకు బాధను కలిగిస్తాయో, అలాంటి విపరీత కర్మలను నీవు ఇతరుల విషయంలో చేయకుండా ఉండుటయే ధర్మం అనబడుతుంది.
🎯 అందుకే ధర్మ తత్వజ్ఞులు ధర్మ శాస్త్రంగా భారతాన్ని భావిస్తారని నన్నయ గారు చెబుతాడు.
🎯 వ్యాసమహర్షి కోటిగ్రంథాల్లో చెప్పిన సారాంశాన్ని అర్ధశ్లోకంలో వివరిస్తూ ధర్మాన్ని ఆచరించేవారు కోటి గ్రంథాలను పటించిన పుణ్యం పొందుతారని చెపుతున్నారు.
🎯 మనం ఇతరులకు మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది.
చెడు చేస్తే పాపం కలుగుతుంది.
ఇదే అసలైన ధర్మసూక్ష్మం.
🎯 ధర్మాచరణమే పరమ ధర్మమని, సచ్ఛీలతయే తపస్సని, సచ్ఛరిత్రయే పరమ జ్ఞానమని బోధిస్తారు మహాత్ములు.
🎯 బ్రహ్మచారి అయిన శ్రవణ కుమారుడు సంధ్యావందనాది విహిత కర్మలు చేస్తూనే, వృద్ధులు, అంధులు అయిన తల్లిదండ్రుల సేవయే పరమ ధర్మంగా భావించి వారికి అనునిత్యం సేవలు చేసి తనలో ఆత్మశక్తిని పెంపొందించు కున్నాడు.
🎯 ధర్మవ్యాధుడు స్వధర్మాన్ని ఆచరిస్తూనే తల్లిదండ్రులకు, అతిథులకు సేవచేస్తూనే, వేదవిహిత కర్మలతో తపోశక్తిని సాధించిన కౌశికుడనే బ్రాహ్మణుడికే తత్వోపదేశం చేసిన ధర్మాత్ముడుగా పేరు గాంచాడు.
🎯 కుక్కుటముని తనకు సమీపంలో ఉన్న కాశీ పుణ్యక్షేత్రాన్ని, పవిత్ర గంగానదిని సేవించక తల్లిదండ్రుల సేవలో ఉన్న పరమార్థాన్ని గ్రహించాడు. అందుకే ప్రతి మనిషి తన తల్లిదండ్రులే పరమాత్మ స్వరూపులుగా భావించి పూజించి తరించాలి. అదే అసలు సిసలైన ధర్మం.
🎯 నీవు ధర్మాన్ని ఆచరించడం గొప్ప కాదు. ధర్మాచరణతో జీవించే వారందరికీ నీవు తోడ్పడాలి. అదే ఉత్తమ ధర్మం.
🎯 భోగాలను విడిచి త్యాగాలను పెంచు కొమ్మంటుంది ధర్మం. అలాగే గుణాలను వదిలి గుణాలను పెంచు కొమ్మంటుంది ధర్మం.
🎯 నీవు అహంకారాన్ని వదిలి నీ ఆత్మ తత్వాన్ని నీవు గ్రహించమని మనకు ఉపదేశిస్తుంది ధర్మశాస్త్రం.
🎯 నిస్వార్థంగా జీవిస్తూ తన శ్రేయస్సు కోసం కాకుండా అందరి అభ్యుదయం కోసం జీవించడమనేది అన్నింటి కన్నా ఉత్తమధర్మం.
🎯 నిస్సహాయులకు, వృద్ధులకు నీవు చేసే సేవ, అందించే సహాయం మానవతా ధర్మం అని అనబడుతుంది.
🎯 ఇతరుల నుండి నీవు ఏమి ఆశిస్తున్నావో దాన్ని నీవు ఇతరులకు అందించడమే అసలైన, నిజమైన ధర్మం.
🎯 ధర్మాన్ని అనుసరించి జీవిస్తున్న వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది అనునిత్యం కాపాడుతుంది.
🎯 ఎవరైతే ధర్మాన్ని ఎప్పుడూ ఆచరిస్తూ ఉంటారో వారికి ఎప్పటికీ జయం వెన్నంటి ఉంటుంది.
🎯 నీవు ఎంతటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నను ధర్మాన్ని విడనాడ కూడదని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి.
🎯 శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి శ్రీరాముడి గుణగణాలు వర్ణిస్తూ 'రామో విగ్రహవాన్ ధర్మః ’ అంటాడు.
🎯 అంటే మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు శ్రీరాముడు. సమస్త ధర్మాలూ ఆయనలోనే ఉన్నాయి. అందుకే ఆయన అందరికీ ఆరాధ్య దైవమయ్యాడు అని అర్థం.
🎯యుద్ధానికి సిద్ధమైన దుర్యోధనుడు తల్లిదీవెన కోసం గాంధారి దగ్గరికి వెళ్ళి తనకు జయం కలిగేలా దీవించ మంటాడు. అప్పుడు గాంధారి, నాయనా 'ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుందని ' దీవిస్తుంది.
🎯ఆమె దీవించిన విధంగానే అధర్మాన్ని పాటించిన కౌరవులు నూరుగురు నశించి పోయారు. ధర్మపరులైన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు.
🎯 మానవుడు జీవితాంతం కష్టపడి సంపాదించిన ధనాన్ని తాను మరణించిన తర్వాత తన వెంట ఒక్క పైసా కూడా తీసుకుపోలేడు. ఎంతటి ధనవంతుడైన మరణం తర్వాత అతని వెంట ఏ ఒక్కరూ రారు. నిన్ను ఎంతో ప్రేమించే భార్య కూడా ఇంటి ముంగిట్లోనే ఆగిపోతుంది. నిన్ను అభిమానించే నీ బందు మిత్రులు శ్మశానం వరకు వచ్చినా తిరిగి వెళ్ళిపోతారు. ఎంతో ప్రేమగా పెంచి పోషించుకున్న నీ శరీరం చితిమంటల్లో కాలి బూడిద అవుతుంది. వెయ్యి ఎకరాలకు యజమానివి అయినా చివరికి నీకు కావాల్సింది కేవలం ఆరడుగుల గొయ్యి మాత్రమే. చివరికి నీతో నీ వెంట నీవు తీసుకు వెళ్లగలిగేది నీవు ఇతరులకు చేసిన ఒక్క ధర్మం మాత్రమే.
ధర్మో రక్షతి రక్షితః