ఆత్మీయ బంధువులారా !
మన తల్లి భారతి ఈ నేలపైన సృష్టించిన అనంత శక్తుల సమ్మేళనమైన అపురూప ఓషధి అశ్వగంధ.
దీన్ని తెలుగులో పెన్నేరు చెట్టు అని పిలుస్తారు.
" పేరు లేని రోగానికి పెన్నేరుచెట్టు " అనేసామెత విన్నారా?
అంటే ఏ రోగమో గుర్తించలేని స్థితిలో ఈ పెన్నేరుగడ్డను ఇవ్వడం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలించవచ్చని ఆయుర్వేద మహర్షులు నిర్ధారించారు.
ఇంత మహత్తరమైన ఓషధిని పూర్వకాలంలో ప్రతిగ్రామంలోను చెరువుగట్లపైన, పంట పొలాలలోను పెంచుకొని ఆ ఊరి ప్రజలంతా వాడుకునే అద్భుతమైన సంప్రదాయం వుండేది.
ఆధునిక విష నాగరికత విజృంభించిన తరువాత ఈ పరిసరాల విజ్ఞానాన్ని కోల్పోయిన భారతీయులు ఈ మొక్కలకు దూరమయ్యారు.
ఈరోజు యావత్ ప్రపంచం శ్లాఘిస్తున్న ఈ అశ్వగంధ గురించి గ్రామ గ్రామాన అందరు పెంచుకొనే అలవాటు చేయాలనే ఆలోచనల నుండి ఆవిర్భవించినదే
🍃 సంజీవని ఔషధ వనం 🍂
ఈ మొక్కను కనుగొనడంలో విఫలం అయితే
మీ ఊరిలో ఉన్న పెద్ద వారిని పెన్నేరు చెట్టు ఎలా ఉంటుందో. . . ఎక్కడ ఉంటుందో. . . చూపించమని అడగండి.
అశ్వగంధ పేర్లు
విథానియా సోమ్నిఫెరా
సంస్కృతంలో అశ్వగంధ, వాజీకరి అని,
హిందీలో అంధ్ అని,
తెలుగులో పెన్నేరు అని,
లాటిన్లో Physalis Flexousa, Vithania, Somni fera అంటారు.
అశ్వగంధ చెట్టు - రూప గుణ ప్రభావాలు
ఇది చూడటానికి వంకాయచెట్టులా వుంటుంది.
కాయలు బఠాణి గింజలంత సైజులో ఎర్రగా కాస్తయి.
ప్రధానంగా దీని దుంపలకు అధిక ప్రాధాన్యం వుంది.
ఈ దుంపలు వగరు కొంచెం చేదురుచులతో ఉష్ణ స్వభావాన్ని కలిగివుంటాయి.
దీని సుగుణాలను వర్ణించడం బ్రహ్మతరం కూడా కాదు.
అశ్వగంధ దుంపలు - ఆవుపాల శుద్ధి
ఆయుర్వేద మూలికలు అమ్మే అంగళ్ళలో ఈ దుంపలను తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఒక పాత్రలో వేసి అవి మునిగేవరకు ఆవుపాలుపోసి చిన్నమంటపైన పాలన్నీ ఇగిరిపోయేవరకు మరిగించి దించి ఆ ముక్కలను ఎండబెట్టాలి.
ఇలా చేసిన తరువాతే ఈ దుంపలను ఉపయోగించుకుంటే అనేకరెట్లు అధికమైన లాభం చేకూరుతుంది.
బలహీనమైన పిల్లలకు అశ్వగంధ
పైన చెప్పినట్లు శుద్ధిచేసిన దుంపలను ఎండించి దంచి పొడిచేసి వాటితో సమంగా పటిక బెల్లంపొడి కలిపి నిలువవుంచుకోవాలి.
బలహీనంగా వుండే బిడ్డ లకు, బుద్ధిబలం లోపించిన బిడ్డలకు ఒక చెంచాపొడి ఒకకప్పు వేడిపాలతో కలిపి సేవింపచేస్తుంటే శారీరక బలం, బుద్ధిబలం పెరుగుతాయి.
ఉత్తమ సంతానానికి - అశ్వగంధ
స్త్రీలు బహిష్టుస్నానం చేసిన నాలుగవ రోజునుండి
పరగడుపున శుద్ధఅశ్వగంధ చూర్ణాన్ని
10గ్రా॥ మోతాదుగా అరగ్లాసు వేడి ఆవు పాలతో తాగుతూ
భర్తతో సంసారం చేస్తుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
వళ్ళంతా మంటలు, పోట్లు, తాపం ఉంటే
అశ్వగంధ,
త్రిఫలచూర్ణం,
అతిమధురం,
పల్లేరు పొడి,
శతావరిపొడి,
పసుపు,
మాని పసుపు,
వీటిని సమంగా తీసుకొని ఈ మొత్తం ఎంత తూకముంటే అంత కొండపిండి వేర్లపొడి కలిపి ఆ మొత్తం ఎంత వుంటే అంత పటిక బెల్లం పొడి కలిపి నిలువవుంచు కోవాలి.
పూటకు 5గ్రా॥ మోతాదుగా
రెండుపూటలా మంచినీటితో సేవిస్తుంటే పైసమస్యలు తగ్గిపోతాయి.
బిగించిన మూత్రం - వెంటనే వచ్చుటకు
అశ్వగంధ,
తిప్పతీగ,
శొంఠి,
ఉసిరిక కాయల బెరడు,
ఏనుగు పల్లేరు కాయలు
వీటిని సమానంగా పొడులు చేసి కలిపి నిలువ వుంచుకోవాలి.
రెండు గ్లాసుల మంచినీటిలో 20 గ్రా॥ పొడివేసి అరగ్లాసు కషాయానికి మరిగించి చల్లార్చి ఒకచెంచా తేనె కలిపి తాగితే వెంటనే మూత్రబంధం, మూత్రంలో మంట తగ్గిపోయి సాఫీగా మూత్రం బయటికి వస్తుంది.
ఉబ్బసం, మూర్ఛవంటి అసాధ్య రోగాలకు
అశ్వగంధాదిచూర్ణం :
అశ్వగంధపొడి 640 గ్రా౹,
దోరగా వేయించిన సొంతిపొడి 320గ్రా||,
దోరగా వేయించిన పిప్పలికట్టిపొడి 160గ్రా|,
దోరగా వేయించిన మిరియాలపొడి 80 గ్రా॥,
ఏలక్కాయల పొడి 40గ్రా|,
నాగకేసరాల పొడి 20గ్రా॥,
లవంగాల పొడి 10గ్రా,
కలిపి అందులో 1270 గ్రా॥ పటిక బెల్లంపొడి కలిపి
గాజు పాత్రలో నిలువవుంచుకోవాలి.
ఈ అద్భుత చూర్ణాన్ని పూటకు 5 గ్రా॥ మోతాదుగా
ఒక చెంచా తేనెకలిపి రెండుపూటలా ఆహారానికి గంట ముందు తింటూవుంటే
ఉబ్బసం, ఆయాసం, ఆకలి లేకపోవడం, అతిపైత్యం, మూర్ఛ, అపస్మారం హరించిపోయి మనసుకు శాంతి, దేహానికి కాంతి, వీర్యానికి బలం కలుగుతాయి.
యోనిబిగువుకు - పెన్నేరుదుంప
అశ్వగంధ గడ్డను మంచినీటితో సానరాయిపైన అరగదీసి
ఆ గంధాన్ని స్త్రీలు యోనికి లేపనం చేసుకొంటూవుంటే
యోని బిగువుగా మారుతుంది.
బహిష్టును క్రమపరిచే అశ్వగంధ
అశ్వగంధపొడి 5 గ్రా॥, పటికబెల్లంపొడి 5గ్రా॥
కలిపి రోజూ ఉదయం మంచి నీటితో సేవిస్తుంటే
అతిగా స్రవించే ఋతురక్తం ఆగిపోయి,
తగిన ప్రమాణంలోనే విడుదలౌతుంది.
లింగబలానికి - అశ్వగంధ
అశ్వగంధ దుంపలపొడి,
నీటిలో పెరిగే నాచును ఎండించి చేసినపొడి,
నల్ల ఉమ్మెత్త గింజల పొడి,
సమంగా కలిపి నిలువచేసుకోవాలి.
రోజూ రాత్రి తగి నంత పొడిని నిమ్మరసంతో నూరి లింగంపైన ముందు బాగం విడిచి, వెనుకభాగానికి లేపనం చేసి ఉదయం కడుగుతూవుంటే అంగం దృఢంగా మారుతుంది.
వాతరోగాలకు - పెన్నేరు చూర్ణం
పెన్నేరు దుంపల పొడి,
దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి,
దోరగా వేయించిన చవ్యంపొడి,
చిత్రమూలం వేర్లపొడి
సమంగా కలిపి దీనికి రెండు రెట్లు పాతబెల్లం కలిపి మెత్తగా దంచాలి.
దీన్ని ప్రతిరోజూ 10గ్రా॥ మోతాదుగా రెండుపూటలా ఆహారానికి గంట ముందు తింటుంటే సమస్త వాతవ్యాధులు సమూలంగా హరించిపోతాయి.
అతిరతికి - అశ్వగంధ ఘుటికలు
అశ్వగంధ దుంపలను ఏడుసార్లు ఆవుపాలలో వేసి పాలు ఇగిరేవరకు మరిగించి ఎండించి దంచినపొడి,
అలాగే చేసిన అతి మధురంపొడి,
అలాగే శుద్ధిచేసిన నేలగుమ్మడిపొడి,
అలాగే శుద్ధి చేసిన నేలతాడి. దుంపల పొడి,
ఏనుగు పల్లేరు కాయల పొడి,
మినుముల పొడి,
శతావరి పొడి,
దూలగొండి గింజలపొడి,
ఉసిరిక కాయలపొడి,
బూరుగు జిగురుపొడి సమంగా కలపాలి.
ఈ మొత్తానికి సమానంగా పటిక బెల్లంపొడి కలిపి
ఆ మొత్తం చూర్ణంలో తగినంత మంచి తేనె చేర్చి బాగా పిసికి లేహ్యం లాగా చేసి నిలువవుంచుకోవాలి.
రోజూ రెండుపూటలా ఆహారానికి రెండుగంటల ముందు 20గ్రా॥ ముద్దను తిని,
ఒక గ్లాసు ఆవు పాలు తాగుతూవుంటే 40రోజులలో అంతులేనంత శరీర బలం వీర్యవృద్ధి కలుగుతాయి.
తుంటి నొప్పికి - అశ్వగంధ పొడి
అశ్వగంధ పొడి పావు చెంచా మోతాదుగా
రోజూ రెండు లేక మూడు పూటలా మంచి నీటితో సేవిస్తూ వుంటే తుంటినొప్పి తగ్గిపోతుంది.
ఉబ్బసమునకు - ఉధృతయోగం
అశ్వగంధపొడి 50గ్రా॥,
దోరగావేయించిన కుర సాని ఓమపొడి 20గ్రా॥,
దోరగా వేయించిన జిలకర పొడి 50గ్రా॥,
దోరగా వేయించిన వాముపొడి 50గ్రా॥,
కరక్కాటక శృంగిపొడి 50గ్రా॥
సమంగా కలిపి నిలువ వుంచుకోవాలి.
దీనిని రెండు పూటలా ఆహారానికి ముందు 3 గ్రా॥
మోతాదుగా వేడి నీటితో సేవిస్తుంటే దగ్గు, ఉబ్బసరోగం హరించిపోతాయి . . .
మీ యొక్క సందేహ నివృత్తి కై ఇక్కడ వత్తి
🍃 సంజీవని ఔషధ వనం 🍂 ని సంప్రదించండి.
స్వస్తీ...